మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదా? గ్రామీణ పేదల కడుపు కొట్టే చర్యలకు పూనుకున్నదా? నూతన నిబంధనలు తీసుకొచ్చి కూలీలు పనికి రాకుండా అడ్డుకుంటున్నదా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తుంది.. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు.. పని దినాలు కుదించడం.. ఉదయం, సాయంత్రం పనిలో ఉన్నట్లు ఫొటోలు అప్లోడ్ చేయడం.. చేసిన పనికి డబ్బులు ఆలస్యంగా చెల్లిస్తుండడం వంటివి బలాన్ని చేకూర్చుతున్నాయి. ఫలితంగా కూలీలు ఉపాధి పనులకు కాదని వ్యవసాయ పనులకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. గడిచిన రెండేండ్లుగా పనికి కూలీలు తగ్గడమే నిదర్శనం..
– మంచిర్యాల, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. గ్రామీణ పేదల కడుపు కొడుతున్నది. 2022-23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 16.67 కోట్ల పని దినాలు పూర్తి చేస్తే.. ఈ యేడాది(2023-24)కేవలం 13.97 కోట్ల పని దినాలను లక్ష్యంగా ఇచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గతేడాది 2.09కోట్ల పని దినాలు పూర్తి చేయగా.. ఈయేడాది 1.80కోట్లు ఇచ్చింది. అంటే 29 లక్షల పనిదినాలను కుదించింది. గతేడాది 20 పనులకు మించి చేయరాదనే నిబంధనలతో పనుల సంఖ్య త గ్గాయి. ఇది కూలీలపై తీవ్ర ప్రభావం చూపింది. 2021-22లో ఉమ్మడి జిల్లాలో 18,442 కుటుంబాలకు వంద రోజులు పని దొరికితే.. 2022-23లో 3,315 కుటుంబాలకు మాత్రమే 100 రోజులు పని దొరికింది.
నిబంధనలతో విస్తు పోతున్న కూలీలు..
తాజాగా ఉపాధి హామీలో కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో కూలీలు పనులకు రావాలంటే జంకుతున్నారు. ముందు ఆధార్ కార్డును జాబ్కార్డుతో అనుసంధానించాలని, అప్పుడే పని వివరాలు నమోదవుతాయని చెప్పా రు. దీంతో వేలాది మంది పనులు మానుకొని ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల పరిధిలోని కూలీలు కొత్త బ్యాంక్ ఖాతాలు తీయమనడంతో కొన్ని రోజులు పనులు బంద్ చేసుకున్నారు. తనిఖీలకు భయపడి కూలీ డబ్బులు వస్తాయో.. రావో.. అని పనులకు రావడానికి వెనుకడుగు వేశారు. వీటన్నింటికి తోడు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పనిలో ఉన్నట్లు ఫొటోలు అప్లోడ్ చేయాలనే నిబంధనతో భయపడిపోతున్నారు. నాలుగు గంటలు పనిచేసి ఫొటోలు పెడితేనే డబ్బులు పడుతాయని చెప్పడం, పైగా చేసిన పనికి డబ్బులు ఆలస్యంగా బ్యాంక్ ఖాతాల్లో పడుతుండడంతో ఉపాధి పనులకు కాదని, వ్యవసాయ పనులకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇలా గడిచిన రెండేళ్లలో పనికి కూలీలు దూరమయ్యారు. పనిదినాలు తగ్గించడం, వంద రోజుల పని దినాలు పొందిన కుటుంబాల సంఖ్య తగ్గడం వంటి వాటికి కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు కారణమవడంతో అధికారులు కూడా విస్తుపోతున్నారు. కేంద్రం కుట్రలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం దిశగా తీసుకువెళ్తున్నాయి.
పదిహేనేళ్లుగా ఉపాధి పనులు చేస్తున్నా..
నేను ఉపాధి హామీ పనులకు పదిహేనేళ్లుగా వెళ్తున్నా. యేటా ఎండాకాలంలో ఈ పనే నాకు ఆధారం. కానీ.. గతేడాది నుంచి కూలీల రాక తగ్గింది. పనుల సంఖ్య తగ్గడంతో పొద్దున, సాయంత్రం ఫొటోలు తీసి పెట్టాలనడంతో రావడానికి చాలా మంది భయపడుతున్నారు. గతంలో తెల్లవారుజామునే వచ్చి ఉదయం 10 గంటలకు వేరే పనికి వెళ్లే వీలుండేది. కానీ.. ఇప్పుడు అలా లేదు. దీంతో చాలా మంది ఉపాధి పనులు మానేసి వేరే పనులకు పోతున్నారు.
– ముత్యాల రాజన్న, దొనబండ, మంచిర్యాల
కూలి గిట్టుబాటైత లేదు..
నేను రెండేండ్లకు ముందు పనికి పోయినపుడు రోజూ రూ.120-రూ.150లు అచ్చేవి. గిప్పుడు రూ.70 కూడా వత్తలేవు. గప్పుడు గదే పని జేసిన. గిప్పుడూ అదే పనిజేత్తన్న. కూలీ మాత్రం తగ్గింది. ఇగ, పనికి పోయి ఏం లాభం? కట్టానికి తగ్గ డబ్బులు గిట్టుబాటైత లేవు. వచ్చే నెల ఎండలు దంచుతయ్. బేవసలు అవుతాం. పని మానేయాలని అనుకుం టున్న. రాష్ట్ర సర్కారోళ్లేమో మేలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ మేమో కుట్ర జేత్తంది.
– ఎండీ ఫాతిమా, దొనబండ, మంచిర్యాల