సిసిసి నస్పూర్: సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను ( Singareni profits ) వెంటనే ప్రకటించి, లాభాల్లో 30 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ( Rajireddy ) డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్లోని బీఆర్ఎస్ ( BRS ) మంచిర్యాల కార్యాలయంలో శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో పెట్రేగిపోతున్న రాజకీయ జోక్యాన్ని తగ్గించాలన్నారు. మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని, సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని సంస్థలోని అన్ని సింగరేణి ఆసుపత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని కోరారు.
కార్మికులకు రిఫరల్ సౌకర్యాన్ని సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభాలను యాజమాన్యం వెంటనే ప్రకటించాలన్నారు. బదిలీల సర్య్యూలర్ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేకపోవడంతో ఆ సర్య్యూలర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు నూనె కొమురయ్య, సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పోగాకు రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఏరియా ఉపాధ్యక్షుడిగా బండి రమేష్ ఎన్నిక
శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడిగా బండి రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ బైలాస్ ప్రకారం నూతన ఉపాధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి వెల్లడించారు. శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడిగా సేవలు అందించిన పెట్టెం లక్ష్మణ్ ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి గోగుల రవీందర్ రెడ్డి, టీబీజీకేఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.