దిలావర్పూర్, మే 17 : యాసంగి కాలం కలిసిరావడంతో ఎకరాకు మొక్కజొన్న 30-35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కానీ.. మక్కలను అమ్ముకుందామంటే రైతులు ఆపసోపాలు పడుతున్నారు. కొనుగోలు కేం ద్రాల్లో నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. నిర్మల్ రైతు సేవ సహకార సంఘం, బనంసపల్లీ రైతు సేవ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిర్మల్ రైతు సేవ సహకార సంఘ ఆధ్వర్యంలో సిర్గాపూర్లో మొక్కజొన్న కొనుగోలు కేం ద్రం ప్రారంభించగా, బన్సపల్లీ సహకార సంఘం ఆధ్వర్యంలో దిలావర్పూర్, కాల్వ, బన్సపల్లీ గుం డంపల్లీ, మండల కేంద్రమైన నర్సపూర్(జీ), రాంపూర్, టెంబుర్నీలలో కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,11,507 మక్కల సంచులను కొనుగోలు చేశారు. 101 లారీల ద్వారా 75,545 మక్క సంచులను తరలించగా, నిర్మల్ రైతు సేవ సహకార సంఘం ద్వారా సిర్గాపూర్లో 6,920 సంచులను కొనుగోలు చేయగా 5,333 సంచులను 8 లారీల ద్వారా గోదాంలకు తరలించారు. ఇంకా కొనాల్సిన మక్కలు చాలా ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు.

కేంద్రం చుట్టూ తిరుగుతున్న..
నాకున్న నాలుగెక రాల భూమి లో మొక్క జొన్న సాగు చేసిన. దిగుబడి మంచిగా వచ్చింది. దిలావర్ పూర్లో సర్కారు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిండ్రని తెలిస్తే మక్కలను 40 రోజుల క్రితం ట్రాక్టర్లు తీసుకొచ్చి కేంద్రంలో పోసిన. 40 రోజుల నుంచి మక్కలను అమ్ముకొనేందు కు కేంద్రం చుట్టూ తిరుగుతున్న. 100 క్వింటాళ్ల మక్కలను అమ్ముకొనేందుకు రోజు రూ.100 నుంచి రూ.200 ఖర్చు అవుతున్నది. – జాదవ్ గణేశ్, తాండ.
అగ్గువకే అమ్ముకున్న..
నా చేనులో పండిన మక్కలను కేంద్రంకు తీసుకొచ్చిన. 10, 15 రోజులు చూసిన సంచులు ఇస్తలేరు. మక్కలు చూస్తలేరు. చేసేది ఏమి లేక ప్రభుత్వ మద్దతు ధర కంటే అగ్గువకే అమ్ముకున్న. 40 క్వింటాళ్ల మక్కలను రూ.1800 ధరకు అమ్ముకున్నా. క్వింటాలుకు రూ.600 నష్టం వచ్చింది.
– కొండ్రు ముఖేశ్, రైతు, దిలావర్పూర్.