రైతన్నలకు మొన్ననే వానకాలం పంట ఉత్పత్తులు అమ్మిన డబ్బులు చేతికొచ్చినయ్. ఆ ఆనందంతో అన్నదాతలు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నారు పోయగా.. సంకాంత్రికి ముందే నాట్లు వేయాలని తహతహలాడుతున్నారు. ఎవుసానికి అన్ని సిద్ధం చేసుకుంటున్న కర్షకులకు కేసీఆర్ సర్కారు తీపికబురు అందించింది. ఇప్పటికే తొమ్మిది సార్లు పెట్టుబడి సాయం అందించిన సర్కారు.. రేపటి (బుధవారం) నుంచి పదో విడుత రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది. దీంతో అన్నదాత లకు సంక్రాంతికి ముందే పండుగొచ్చినట్లయింది. పనులు మొదలైన వెంటనే కేసీఆర్ సారు పెట్టుబడి సాయం ఇస్తున్నాడంటూ సంబురపడి పోతున్నారు. ఇక సావుకార్లు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పిందని ఆనందంగా చెబుతున్నారు. పంట పెట్టుబడి సమయానికి రైతుబంధు డబ్బులిస్తున్న తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటామని రైతన్నలు పేర్కొంటున్నారు.
మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ) : యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నకు తెలంగాణ సర్కారు రేపటి(బుధవారం) నుంచి రైతుబంధు సాయం అందించాలని నిర్ణయించింది. సంక్రాంతిలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ట్రెజరీకి నిధులు కూడా విడుదల చేసింది. తొలుత ఎకరాకు రూ.4 వేలు అందజేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత రూ.5 వేలు అందిస్తున్నది. ఈ విధంగా యేటా రెండు పంటలకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నది. ఇప్పటివరకు గత వానకాలాన్ని కలుపుకొని తొమ్మిది సీజన్లలో పంట పెట్టుబడి సాయాన్ని అందించింది. ప్రస్తుతం యాసంగికి పదో విడుత అందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కాగా.. ఈ యాసంగికి జిల్లాలవారీగా కొత్తగా అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశారు. ఈనెల 20 వరకు కొత్తగా పట్టా పాస్బుక్ పొందిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్తగా పట్టా పాస్బుక్ పొందిన వారు జనవరి 7వ తేదీ లోగా రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జనవరి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న కొత్త వారికీ అవకాశం
కొత్తగా భూములు కొన్న రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈనెల 20వ తేదీ లోపు కొత్తగా భూమి కొనుగోలు చేసి.. పట్టాదారు పుస్తకం లేదా ఆఫీసు కాపీ వచ్చిన రైతులు వచ్చే జనవరి 7వ తేదీలోపు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తమ దరఖాస్తును అందజేయాలి. గడువులోపు దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ ఈసారి యాసంగి కోసం రైతుబంధు సాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ యాసంగికి నిర్మల్ జిల్లాలోని 1,86,418 మంది రైతుల ఖాతాల్లో రూ.227.64కోట్లు జమ కానున్నాయి. గత వానకాలం సీజన్లో 1,74,767 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.220.73 కోట్లు జమ అయ్యాయి. గత తొమ్మిది విడుతల్లో నిర్మల్ జిల్లా రైతాంగానికి రైతుబంధు కింద రూ.1,717 కోట్లు ప్రభుత్వం అందజేసింది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1.53 లక్షల మంది రైతులకు రైతుబంధు డబ్బులు అందనున్నాయి. ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున రూ.275.99 కోట్లను తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందించనుంది. డిసెంబరు 20వ తేదీలోగా పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతులకు కూడా సాయం అందనుంది. విడుతలవారీగా డబ్బులు జమకానుండగా.. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా 1,22,103 మంది రైతులు ఉండగా.. రూ.201.68 కోట్ల సాయం అందనుంది. గత వానకాలంతో పోలిస్తే 2,368 మంది పెరిగారు. ఇందులో 2,125 మంది వివరాలు ఆన్లైన్లో అప్డేట్ కావడంతో ఈ యాసంగికి అర్హత సాధించారు. మరో 243 మంది వివరాలు పూర్తిగా అప్డేట్ కానట్లుగా తెలుస్తున్నది.
మంచిర్యాల జిల్లాలో ఈ యాసంగికి సంబంధించి 1.56 లక్షల మంది రైతులకు రూ.172.11 కోట్లు రానున్నాయి. 2022 వానకాలంలో 1.43 లక్షల మందికి రైతుబంధు ఇచ్చారు. 2018 వానకాలం నుంచి ఇప్పటివరకు రైతులకు రూ.1,284.56 కోట్ల రైతుబంధు డబ్బులు వచ్చాయి. ఈ యాసంగి డబ్బులతో కలుపుకుంటే ఒక్క మంచిర్యాల జిల్లాకే గడిచిన ఐదేళ్లలో రూ.1,456.67కోట్ల రైతుబంధు సాయం అందనుంది.