మంచిర్యాల అర్బన్, నవంబర్ 18 : ఆటల పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. జిల్లాలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్, అండర్ -17 బాలబాలికల బ్యాడ్మింటన్ పోటీలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అదనపు కలెక్టర్ రాహుల్, ఇన్చారిజ డీసీపీ అఖిల్ మహాజన్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడారు. క్రీడాకారులకంటే వారి తల్లిదండ్రులు ఎక్కువగా కష్టపడుతుంటారని, పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చి వారిని ప్రోత్సహిస్తుంటారని చెప్పారు.
క్రీడాకారులు సైతం ప్రతిభ చూపి తల్లిదండ్రులు, తమ ప్రాంతానికి పేరు తీసుకురావాలని సూచించారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, పోటీల్లో పాల్గొన్నవారంతా విజేతలేనని తెలిపారు. క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, అడిషనల్ కలెక్టర్ రాహుల్, డీటీవో శ్రీనివాస్ పోటీలను ప్రారంభించారు. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ట్రెజరర్ పాణిరావు, చీఫ్ అడ్వైజర్ ముఖేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, కోశాధికారి సత్యపాల్ రెడ్డి, రమేశ్ రెడ్డి, మధు, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
క్యాంప్ ఫైర్..
రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా రాత్రి నిర్వహించిన క్యాంప్ ఫైర్లో క్రీడాకారులు పాల్గొని నృత్యాలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎడ్లమహేష్, సుధాకర్, ముఖేశ్ గౌడ్, రమేశ్ రెడ్డి, మధు, క్రీడాకారులు పాల్గొన్నారు.