మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్,మార్చి 19 (నమస్తే తెలంగాణ);నీళ్లు, నిధులు, నియామకాల సెంటిమెంట్పైనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇప్పటికే 1.33 లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల పాలిట కల్పవల్లిగా మారింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) 35వేలకు పైగా ఉద్యోగాలను కల్పించింది. పైరవీలు, లంచాలకు తావులేకుండా.. ప్రతిభ ఆధారంగా నియామక ప్రక్రియను పకడ్బందీగా.. పారదర్శకంగా నిర్వహించింది. ప్రతి నోటిఫికేషన్ను పక్కాగా విడుదల చేసి.. నిజాయితీగా ఉద్యోగాలు కల్పించింది. ఫలితంగా పేద, మధ్య తరగతి కుటుంబాల వారు కష్టపడి చదివి ప్రభుత్వ శాఖల్లో ఉన్నతోద్యోగం చేస్తున్నారు. వేలాది ఉద్యోగాలు కల్పించిన కమిషన్పై ఒకరిద్దరు చేసిన తప్పుడు ఆరోపణలపై రాద్దాంతం చేయడం తగదని టీఎస్పీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. నిరుద్యోగులు గందరగోళం చెందాల్సిన అవసరం లేదని, గత టీఎస్పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లలో ఉద్యోగాలు సాధించిన వారు ధైర్యం చెబుతున్నారు. నిరుత్సాహపడొద్దని, మీ ప్రయత్నాలను కొనసాగించాలని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
నాది నిర్మల్ రూరల్ మండలంలోని ముజ్గి. మాది వ్యవసాయ కుటుంబం. మా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు.. 8-10 వరకు చిట్యాల జడ్పీహెచ్ఎస్లో చదివా. నిర్మల్లో ఇంటర్, డిగ్రీలు పూర్తి చేశా. హైదరాబాద్లోని నిజాం కాలేజీలో పీజీ చేశా. మా నాన్న లింగన్న 2013 సంవత్సరంలో చనిపోయాడు. తల్లి గంగవ్వ మాకున్న నాలుగెకరాల వ్యవసాయ భూమిలో పంటలు పండిస్తూ చదివించింది. అమ్మ పడ్డ కష్టాన్ని కళ్లారా చూశా. దీంతో పట్టుదలతో చదివా. 2014లో లా-సెట్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించా. లా చదువుతున్నప్పుడే 2019లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది. అంతకు ముందే 2016లో టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్-2 పరీక్ష రాశా. ఫలితాలు 2019 అక్టోబర్లో వచ్చాయి. 2020 జనవరిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఎక్సైజ్ స్టేషన్లో పనిచేస్తున్న. గ్రూప్-2 పరీక్ష కోసం రోజుకు దాదాపు 9-10 గంటలు చదివి అనుకున్నది సాధించా. తెలంగాణ వచ్చిన తర్వాత నయా పైసా ఖర్చు లేకుండా రెండు ఉద్యోగాలు లభించాయి. ఎక్కడో ఒక చోట ఏదో జరిగిందని నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటివి పట్టించుకోవాల్సిన పనిలేదు. మనపై మనకు నమ్మకం ఉండాలి. వ్యవస్థలపై కూడా నమ్మకాన్ని పెట్టుకొని చదవాలి. అప్పుడే విజయం సాధిస్తాం. ఉద్యోగం వస్తుందో రాదో.. డబ్బులు పెట్టే వారికే వస్తుందేమోనన్న అనుమానాలు ఉండకూడదు. నా మిత్రులు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారిలో పేద, మధ్య తరగతి వారు ఉన్నారు. వారంతా పక్కా ప్రిపరేషన్తోనే జాబ్లు కొట్టారు.
నీళ్లు, నిధులు, నియామకాలనే సెంటిమెంట్ మీద వచ్చిన తెలంగాణలో ఇప్పటివరకు 1.33 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో 35 వేల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) భర్తీ చేసినవే. కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటిన ఎంతో మంది ఈ రోజు మున్సిపల్ కమిషనర్లుగా, డిప్యూటీ తహసీల్దార్లుగా, సీనియర్ అసిస్టెంట్లుగా వివిధ ప్రభుత్వశాఖల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వీరంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. గడిచిన ఎనిమిదేళ్లలో ఏ పరీక్ష నిర్వహించిన టీఎస్పీఎస్సీ పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా తన బాధ్యతలను నిర్వర్తించింది. కానీ.. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లలో కొందరు వ్యక్తులు అత్యాశకు వెళ్లి పేపర్ లీకేజీ చేశారు. ఈ విషయాన్ని కూడా టీఎస్పీఎస్సీ స్వయంగా వెల్లడించింది. దీనిని పట్టుకొని కొందరు రాజకీయ పబ్బం గడిపే వ్యక్తులు చేస్తున్న రాద్దాంతంతో నిరుద్యోగులు గందరగోళ పడిపోతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని, ఉద్యోగార్థులకు న్యాయం చేస్తామని చెబుతున్నా అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉద్యోగార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లలో ఉద్యోగాలు సాధించిన వారు ధైర్యం చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహ పడొద్దని, మీ ప్రయత్నాలను కొనసాగించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
టీఎస్పీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించింది..
నాది ఆదిలాబాద్ జిల్లా బరంపూర్ గ్రామం. వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నతనం నుంచి ఉద్యోగం సాధించాలని కష్టపడి చదివా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రూప్-2 ఉద్యోగం కొట్టాలనే తపన ఉండేది. నా సతీమణి కల్పన సహకారంతో హైదరాబాద్ సైన్ ఇనిస్టిట్యూట్లో ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నా. 2016 పరీక్షలు జరగ్గా.. 2017లో సర్టిఫికేట్ వెరిఫికేషన్, 2018లో కోర్టు కేసులో ఆలస్యం, 2019లో రిజల్ట్ వెలువడింది. 2020 కరోనా కాలంలో హైదరాబాద్ తాలిమ్ అకాడమిలో ట్రైనింగ్ తీసుకున్నా. ఎటువంటి అవకతవలు లేకుండా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగం సాధించా. ఇప్పుడు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో నాయబ్ తహసీల్దార్గా ఉద్యోగం చేస్తున్నా. పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఉద్యోగం ఊపిరినిచ్చింది. నేను ఉద్యోగం సాధించడంతో నా తండ్రి జటంకుల గంగన్నకు, నా కుటుంబానికి సమాజంలో మంచి గౌరవం ఏర్పడింది. కాగా.. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించడం వల్లనే నాయబ్ తహసీల్దార్గా ఉద్యోగం లభించింది.
– గణేశ్, నాయబ్ తహసీల్దార్, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
పైరవీలు లేకుండా ఉద్యోగం వచ్చింది..
నాది ఆదిలాబాద్ జిల్లా బోథ్. మా తల్లిదండ్రులు విజయ-స్వామి. నాకు చెల్లి రమ్యశ్రీ, తమ్ముడు రాకేశ్కుమార్ ఉన్నారు. మాది నిరుపేద కుటుంబం. మా నాన్న కూలీ పనికి వెళ్తుండే. తల్లి బీడీలు చుడుతోంది. నా పదో తరగతి వరకు బోథ్ ప్రభుత్వ పాఠశాల, ఇంటర్మీడియట్ లక్ష్మణచాంద మండలంలోని సహకార జూనియర్ కాలేజీలో చదివా. నిర్మల్లో డిగ్రీ చదువుతుండగా మా నాన్న అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ భారం నా పైనే పడింది. బట్టల దుకాణంలో పనిచేస్తూ చదివా. నెలకు రూ.1500 వచ్చేవి. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే మా కష్టాలు దూరమవుతాయని భావించా. 2018లో టీఎస్పీఎస్సీ ద్వారా మున్సిపాలి టీల్లో హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదల తో రోజు 8-9 గంటలు కష్టపడి చదివా. 2019 చివరలో ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన మెరిట్ లిస్టులో రాష్ట్రంలో 8వ స్థానం, జోన్లో రెండో స్థానంలో నిలిచా. 2020 ఫిబ్రవరిలో ఆదిలా బాద్ మున్సిపాలిటీలో పోస్టింగ్ ఇస్తూ.. అదే ప్రొసీడింగ్తో ఖానాపూర్కు డిప్యూటేషన్పై పంపా రు. పకడ్బందీ ప్రణాళికతో చదవడం వల్లనే జాబ్ కొట్టగలిగా. ఉద్యోగంలో చేరినప్పుడు రూ. 24వేల జీతం ఉండే.. ఇప్పుడు నెలకు రూ.33 వేలు. ఎలాంటి పైరవీ లేకుం డా, పైసా ఖర్చులేకుండా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లనే మాలాంటి నిరుపేదలకు మేలు జరుగుతున్నది.
మేం రాసినప్పుడు చాలా బాగుండేది..
టీఎస్పీఎస్సీ గతంలో ఇలాంటి గందరగోళం ఎప్పుడూ జరగలేదు. మా నోటిఫికేషన్లో కష్టపడిన వారందరికీ ఉద్యోగాలు వచ్చాయి. నాతో పాటు ప్రిపేరైనా చాలా మంది టాపర్లుగా నిలిచారు. ఇప్పుడు మంచి హోదాలో ఉన్నారు. అప్పటి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి చాలా గోప్యంగా వ్యవహరించే వారు. టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రతిది పారదర్శకంగా జరిగేది. కానీ.. కోర్టు కేసుల కారణంగా అప్పటిలో కొంచెం నెమ్మదిగా రిక్రూట్మెంట్ జరిగింది. పరీక్షలు, ఇంటర్వ్యూలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించారు. 2016లో గ్రూప్-2కు అర్హత సాధించా. మా బ్యాచ్కు 2020లో అపాయింట్మెంట్ వచ్చింది. మా సొంతూరు భూపాలపల్లి జిల్లా మల్లారం. పదో తరగతి మా ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. హన్మకొండ చైతన్య కాలేజీలో ఇంటర్, డిగ్రీ, 2013లో పీజీ ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ పూర్తి చేశా. రెండేళ్లు హైదరాబాద్లో ప్రైవేటు జాబ్ చేస్తూ తొమ్మిది నెలలు కష్టపడి చదివా. తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2 వచ్చింది. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా వేశారు. మొన్నటి వరకు లక్షెట్టిపేటలో ఎఫ్ఏసీ తహసీల్దార్గా చేశా. ఇప్పుడు కూడా లీవ్ పెట్టుకొని వచ్చి హైదరాబాద్లో ఉండి గ్రూప్-1 ప్రిపేర్ అవుతున్నా. ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యా. ఇంతలో అది క్యాన్సల్ అయ్యింది. దీంతో చాలా మంది సెలవులు పెట్టుకొని, కుటుంబాలకు దూరంగా ఉండి చదువుకునే వాళ్లు నష్టపోయినట్లే. కానీ.. ఇందులో టీఎస్పీఎస్సీ డైరెక్ట్ ఇన్వాల్మెంట్ లేకున్నా వాళ్లు మాత్రం బాధ్యత తీసుకోవాల్సిందే. జరిగిన పొరపాటు చిన్నదైతే కాదు. కానీ.. నిరుద్యోగులు ఎవరూ నిరుత్సాహ పడొద్దు. మన ప్రయత్నంలో లోపం ఎప్పుడూ ఉండకూడదు. టీఎస్పీఎస్సీ తప్పకుండా అందరికీ న్యాయమైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం ఉంది.
– వారనాసి సనత్కుమార్, లక్షెట్టిపేట ఇన్చార్జి తహసీల్దార్
నాకు రెండు జాబ్లు వచ్చాయ్..
నా పేరు మేకర్తి గణేశ్. మాది మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని కాసిపేట. 2012లో బీటెక్ చేశా. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్లోని ఓ ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నా. అనంతరం ఇంటికి వచ్చి క్రమం తప్పకుండా ప్రిపేరయ్యా. తాండూరులో స్నేహితులతో కలిసి కంబైండ్ స్టడీ, గ్రూప్ డిస్కషన్ వంటి అంశాల్లో పట్టుసాధిస్తూ చదివా. అప్పుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ కోసం 2019లో పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో నోటిఫికేషన్లు ఇచ్చింది. పరీక్షలో రెండింటికీ అర్హత సాధించా. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని నా లాంటి సాధారణ కుటుంబ నైపథ్యం ఉన్న వ్యక్తికి ఉద్యోగం రావడం గొప్ప విషయం. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించారు కాబట్టే నా కష్టానికి తగిన ఫలితం లభించింది. 2019లో ఏప్రిల్ నుంచి జూలై వరకు పంచాయతీ సెక్రటరీగా, 2019 ఆగస్టు నుంచి 2021 మార్చి వరకు వీఆర్వోగా విధులు నిర్వహించా. కానీ.. మా అమ్మనాన్నకు నేను పెద్ద ఉద్యోగి కావాలనే కోరిక. అందుకే చెన్నూరులో వీఆర్వోగా విధులు నిర్వహిస్తూనే కష్టపడి చదివా. అప్పుడు గ్రూఫ్-4 నోటిఫికేషన్లో ఫారెస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్నా. కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాలనైనా సాధించవచ్చు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగి ఒకరు చేసిన పనికి మొత్తం టీఎస్పీఎస్సీని తప్పుపట్టడం సరికాదు. కాకపోతే ఇన్ని రోజులు కష్టపడి చదువుతున్న నిరుద్యోగులకు ఇది చాలా కష్టమైన విషయం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని నిరుద్యోగులకు తగిన న్యాయం చేయాల్సిన అవసరమైతే ఉంది.
– మేకర్తి గణేశ్, జూనియర్ అసిస్టెంట్, అటవీశాఖ
బీఆర్ఎస్ను బదనం చేయద్దు..
నా పేరు జోగు రాజమల్లు. మాది మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం. గత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లలో రెండు ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పటివరకు ఏడు ఉద్యోగాలు సాధించా. 2014, 2018లో వీఆర్వో జాబ్లు వచ్చాయి. మిగిలినవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. నేను పరీక్షలు రాసినప్పుడు టీఎస్పీఎస్సీ చాలా పారదర్శకంగా, సజావుగా పరీక్షలు నిర్వహించింది. నాది ఒక పేద రైతు కుటుంబం. మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అప్పటి నుంచి అమ్మ మాకున్న మూడెకరాల భూమిని సాగు చేస్తూ చదివించింది. జాబ్ కొట్టాలని చిన్నప్పటి నుంచి బలంగా ఉండేది. కానీ.. చదివించే స్తోమత అమ్మకు లేకపోవడంతో మంచిర్యాల జిల్లా ఇందారం రెసిడెన్సియల్లో పదో తరగతి, నిర్మల్ జిల్లా ముథోల్ రెసిడెన్సియల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశా. పదో తరగతిలో 520 మార్కులు రావడంతో 2009లోనే పోస్టల్ డిపార్ట్మెంట్లో బీపీఎం ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి పని చేస్తూనే ఇంటర్, బీటెక్ పూర్తి చేశా. పోటీ పరీక్షలకూ ప్రిపేర్ అయ్యా. అలా టీఎస్పీఎస్పీ 2014 నోటిఫికేషన్లో వీఆర్వో జాబ్ వచ్చింది. నిర్మల్ జిల్లా చింతల్చాందా చామన్పల్లిలో పోస్టింగ్ ఇచ్చారు. అనంతరం ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చాయి. 2018లో మళ్లీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాస్తే వీఆర్వో ఉద్యోగం వచ్చింది. నా లాంటి పేదోడికి రెండు సార్లు పరీక్ష రాస్తే రెండు సార్లు ఉద్యోగం వచ్చింది.
– జోగు రాజమల్లు, కొమ్మెర, చెన్నూర్ మండలం
ఉత్తమ విధానాల వల్లే ఉగ్యోగం
మాది మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామం. మా నాన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగి. 2017 సంవత్సరంలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ వెలువడింది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా. నేనే సొంతంగా ఇంట్లోనే ప్రిపేర్ అయ్యా. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. పట్టుదలతో చదివా. స్టడీ మెటీరియల్ కొనుక్కొని చదువుకున్నా. 2018లో మంచి మార్కులు రావడంతో జాబ్ వచ్చింది. టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో పాదర్శకత వల్లే నాకు జాబ్ వచ్చింది. నియామక విధానాల్లో లోపాలు లేవు. టీఎస్పీఎస్సీ ఉత్తమ విధానాల వల్లనే నిజాయితీగా ఉద్యోగం పొందా. అర్హతను బట్టి నేను డిప్యూటీ సర్వేయర్గా ఉద్యోగం చేస్తున్నా.
– రామకృష్ణ, డిప్యూటీ సర్వేయర్, బెజ్జూర్, ఆసిఫాబాద్ జిల్లా.
నిజాయితీగా నియామక ప్రక్రియ
నేను ఎంఏ, ఎంఈడీ చేశా. 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా ఇచ్చిన ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా. కోచింగ్కు వెళ్లకుండా ఇంట్లోనే స్టడీ మెటీరియల్ తెప్పించుకొని ప్రిపేర్ అయ్యా. టీఎస్పీఎస్సీ 2018లో పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో నేను సాధించిన మార్కులను బట్టి టీజీటీగా ఉద్యోగం లభించింది. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీటీజీ పాఠశాలలో పని చేస్తున్నా. ఇక్కడ పైరవీలు, ఇతర అక్రమ విధానాలు జరుగలేదు. ఇంట్లో ఉండి ప్రిపేరైన నాలాంటి వారికి కూడా ఉద్యోగం వచ్చిందటే.. నియామక ప్రక్రియ ఎంత నిజాయితీగా జరిగిందో అర్థం చేసుకోచ్చు. మా అన్న లూథర్ కింగ్ కూడాభీమినిలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టింది. అనవసర అపోహలు పెట్టుకోవద్దు.
– చిన్నం ప్రవీణ్బాబు, టీజీటీ, ఆసిఫాబాద్.
ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యా..
టీఎస్పీఎస్సీ ద్వారా జరుగుతున్న ఉద్యోగాల నియామక ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుంది. 2016లో నిర్వహించిన టెట్లో నాకు స్టేట్ ఐదో ర్యాంకు వచ్చింది. 2017లో ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. నేను ఇంట్లోనే ఉండి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యా. ఆ తరువాత టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించారు. నాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. నేను నా ట్యాలెంట్ని నమ్ముకొని ఉద్యోగం పొందా. మా నాన్న కార్పెంటర్గా పని చేస్తున్నారు. మాకు టీఎస్ పీఎస్సీ ఉద్యోగాల నియామక ప్రక్రియపై కూడా ఎలాంటి సందేహం కలుగలేదు. టీఎస్పీఎస్సీ నిజాయితీ వల్లనే నేను ఉద్యోగం సాధించా. నియామక ప్రక్రియ పూర్తి పాదర్శకంగా సాగింది.
– కృష్ణా చారి, పీజీటీ, ఆసిఫాబాద్.
అపోహలు నమ్మద్దు..
తెలంగాణ సర్కారు వేల సంఖ్యలో ఉగ్యోగాలు భర్తీ చేస్తున్నది. ఉద్యోగార్థులు సోషల్ మీడియాలో వస్తున్న అపోహ లను నమ్మద్దు. వ్యవస్థపై నమ్మకం పెట్టి.. నిర్ధేశించుకున్న లక్ష్యాలు చేరుకోవాలి. కష్టపడి పట్టుదలతో చదివితే ఉద్యోగం పక్కాగా వస్తుంది. ఇందుకు నేను నిదర్శనం.
– వన్నెల గంగాధర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ముజ్గి.