ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్న రాష్ట్ర సర్కారు విద్యా సంవత్సరానికి ముందే పుస్తకాలను సరఫరా చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 2,682 పాఠశాలలకు 16,27,830 పాఠ్యపుస్తకాలు, 10,89,830 నోట్ పుస్తకాలను అందించగా, పంపిణీ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. నాణ్యమైన కాగితంపై రకరకాల బొమ్మలతో ఆకట్టుకునేలా ప్రింట్ చేయగా, విద్యార్థుల్లో ఆసక్తితో పాటు సంబురం కనిపిస్తున్నది. ఇక బుక్స్పై ముద్రించిన క్యూ ఆర్ కోడ్ను సెల్తో స్కాన్ చేస్తే చాలు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా వీడియోలు దర్శనమిస్తున్నాయి. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ రూపాయి ఖర్చులేకుండా మెరుగైన విద్యనందిస్తుండగా, ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు చేరే పిల్లల సంఖ్యక్రమంగా పెరుగుతున్నది.
మంచిర్యాల, జూలై 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల విద్యార్థులకు రాష్ట్ర సర్కారు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నది. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలల ప్రారంభానికి ముందే పుస్తకాలు జిల్లాలకు చేరాయి. గతేడాది సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలను సరఫరా చేశారు. ఈ మధ్యే నోట్ పుస్తకాలు కూడా వచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 16,27,830 పాఠ్యపుస్తకాలు, 10,89,830 నోట్ పుస్తకాలను ప్రభుత్వం పంపించింది. దీంతో బడుల్లో పుస్తకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నది. కొత్త పుస్తకాలు ఇస్తుండడంతో విద్యార్థుల్లో ఉత్సాహం పెరిగింది. కొత్త పుస్తకాలను చూసి తెగ సంబుర పడిపోతున్నారు. బడిబాటలో భాగంగా పాఠశాలల్లో చేరే విద్యార్థులకు వెంటనే పుస్తకాలు ఇస్తుండడంతో పిల్లల్లో రెట్టింపు సంబురం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఆకట్టుకుంటున్న పాఠ్య పుస్తకాలు..
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు ఆకట్టుకుంటున్నాయి. నాణ్యతతో కూడిని కాగితం, ఆయిల్ ప్రింట్, కట్టిపడేసే బొమ్మలు ఉండడంతో చిన్నారులు వాటిని చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులు ఉన్నాయని, మన ఊరు-మన బడితో రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని చెబుతున్నారు. దానికి తగట్టుగానే పుస్తకాలు, యూనిఫామ్లు ఇస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పుస్తకాలపై కోడింగ్ నంబర్లు ఉంటున్నాయి. ఒక్కో విద్యార్థికి సబ్జెక్ట్ వారీగా ఒక్కో నంబర్ కేటాయించారు. దీంతో పాఠ్యపుస్తకాలు మిస్యూజ్ కాకుండా ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆరో తరగతి.. ఆపై తరగతుల పుస్తకాలకు క్యూ ఆర్ కోడ్ ఇచ్చారు. ఆ కోడ్ను మొబైల్ ఫోన్లో క్యూ ఆర్ కోడ్ స్కానర్ యాప్ ద్వారా స్కాన్ చేసిన వెంటనే సంబంధిత విషయంపై అదనపు సమాచారంతో కూడిన వీడియోలు ప్లే అవుతున్నాయి. దీంతో విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పే పాఠశాలతో పాటు ఇది మరింత ఉపయోగపడనున్నది. వీటితో పాటు తరగతుల వారీగా పిల్లలకు అవసరమయ్యే నోట్ పుస్తకాలను సైతం పంపిణీ చేస్తున్నారు.
కొరత లేదు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లకు సరిపడా నోట్, పాఠ్య పుస్తకాలు అందు బాటులో ఉన్నాయి. ఎక్కడా కొరత లేదు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం చాలా మంచిది. పట్టణ, గ్రామీ ణ ప్రాంత పేద విద్యార్థు లకు ఇవి ఎంతగానో ఉ పయోగపడుతున్నాయి. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా సర్కారు స్కూళ్లను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారు. మెరుగైన విద్యాబోధన జరుగుతున్నది.
– యాదయ్య, మంచిర్యాల డీఈవో
ప్రైవేట్కు పోయేటోళ్లు కూడా మా బడికే వస్తున్నరు
కెరమెరి, జూలై 10 : నా పేరు నాగేశ్వరి, కెరమెరి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న. మా బడిని మస్తు సూపర్గా చేసిన్రు. ఇది వరకు కింద కూర్చునేటోళ్లం. ఇప్పుడు కొత్త బెంచీలు ఏర్పాటు చేసిన్రు. ఆన్లైన్ ద్వారా డిజిటల్ తరగతులు చెబుతున్నరు. మధ్యాహ్నం పెట్టే భోజనం మస్తు మంచిగ ఉంటంది. మాకు రెండు జతల యూనిఫాంలతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్లు ఇచ్చిన్రు. మా బడిలో అన్నీ ఉచితంగనే ఇస్తున్నరు. ఇక్కడైతే రూపాయి ఖర్చు లేకుండా చదువుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్కు పోయేటోళ్లు కూడా ఇప్పుడు మా బడికే వస్తున్నరు.
పుస్తకాలు మంచిగున్నాయి
చెన్నూర్ రూరల్, జూలై 8 : మా బడిలో అందరికీ ఉచితంగా బుక్స్తో పా టు నోట్ బుక్స్ ఉచితంగా ఇచ్చా రు. బడి మొదలైనంకనే మా సార్లు తెలుగు, ఇంగ్లిష్, సైన్స్, సోషల్, గణితం, హిందీ, డ్రాయింగ్ పుస్త కాలు ఇచ్చారు. ఒక వైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు అక్షరా లతో ప్రింటింగ్ చేశారు. మస్తు మంచిగున్నాయి. అదే ప్రైవే ట్ పాఠశాలల్లో అయితే కొనుక్కోవాలి. వేలకు వేలు అయ్యే టివి. యూనిఫాంలు కూడా వట్టిగనేఇచ్చారు. సర్కారు బడిలో చదువుకుంటున్నందుకు సంతోషంగా ఉంది.
– రిత్విక్, 5వ తరగతి, యూపీఎస్ పాఠశాల, చెన్నూర్
అన్నీ ఉచితంగా ఇస్తున్నారు
బజార్హత్నూర్, జూలై 10 : ప్రైవేట్ పాఠశాలకు పోతే అన్నీ కొనుక్కునుడే. అదే ప్రభుత్వ పాఠశాలకు పోతే అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. పుస్తకాలతో పాటు యూనిఫాంలు కూడా వస్తున్నరు. మాకు కొన్ని రోజుల కింద కొత్త బుక్స్, నోట్ బుక్స్ ఇచ్చారు. మస్తు సంబురమనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చినంక ఫ్రెండ్స్తో కలిసి చదువుకుంటున్న.
– శాన్వి, 4వ తరగతి, కాండ్లీ
సర్కారు బడికే వస్తున్నారు
తాంసి, జూలై 10 : ప్రభుత్వం ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడంతో మా తల్లిదండ్రులకు భారం తగ్గింది. గతంలో కొనుగోలు చేసే శక్తిలేక ఒకటీ.. రెండు పుస్తకాలతోనే వెళ్లదీసేవాళ్లం. నోట్ బుక్స్ లేక రాసుకోలేక పోయేవాళ్లం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అన్నీ ఉచితంగా ఇస్తుంది. అందుకే ప్రైవేట్ పాఠశాలకు పోయేవాళ్లు కూడా సర్కారు బడిలో వచ్చి చేరుతున్నారు.
– శ్రీజ, పదో తరగతి, జడ్పీ ఉన్నత పాఠశాల, పొన్నారి
రూపాయి కూడా ఖర్చయితలేదు
తాంసి, జూలై 10 : ప్రభుత్వ బడుల్లో ఉచితంగా ఏక రూప దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తుంది. ఈ ఏడాది నోటు పుస్తకాలు కూడా ఇచ్చారు. గతంలో నోటు బుక్కులు కొనేందుకు ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు సర్కారు బడిలో నోట్ బుక్స్ ఇవ్వడంతో మా తల్లిదండ్రులకు రూపాయి కూడా ఖర్చు కావడం లేదు.
– శృతి, పదో తరగతి, జడ్పీ ఉన్నత పాఠశాల, పొన్నారి
ఇంగ్లిష్ మీడియం చదువుతున్నం..
తాంసి, జూలై 10 : ఇంగ్లిష్ మీడియం చదవాలంటే లక్షలు అవుతున్న య్. ఏది కొనాలన్నా మస్తు డబ్బులు కావాలి. తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పేద విద్యార్థుల కోసమే సర్కారు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడి యం తీసుకొచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా ఇంగ్లిష్ చదువుకునే అవకాశం కల్పించింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది.
– హర్షిత, పదో తరగతి, జడ్పీ ఉన్నత పాఠశాల, కప్పర్ల