నిర్మల్, జూలై 20(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పట్టింపులేని తనంతో కులవృత్తులు కనుమరుగయ్యాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా బీసీల్లోని కులవృత్తులను నమ్ముకొని బతుకుతున్న వారికి రూ.లక్షల ఆర్థికసాయం అందించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం కులవృత్తులకు రూ.లక్ష పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 46 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా కూడా బీసీల కోసం ఇలాంటి పథ కం లేదన్నారు. నియోజకవర్గంలో 300 మందికి ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు. ప్రతి వెనుకబడిన కుటుంబానికి పూర్తి పారదర్శకంగా అందిస్తామని చెప్పారు. ఈ మొత్తాన్ని కులవృత్తులకు అవసరమైన ముడి సామగ్రి కొనుగోలుకు వినియోగించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో మొత్తం 11,759 మంది అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని వెల్లడించారు. వీరందరికీ విడుతలవారీగా ప్రభుత్వ సాయం అందుతుందన్నారు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే త్వరలోనే మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అనేక వృత్తుల్లో కార్పొరేట్ సంస్థలు ప్రవేశించగా, తెలంగాణలో కులవృత్తులు అంతరించిపోయే దుస్థితికి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోకపోవడంతో వృత్తి పనులు నడువక, ఆదాయం రాక అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ పోషణ భారమై అనేక మంది వృత్తులను వదులుకొని వలస వెళ్లారని గుర్తు చేశారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో కులవృత్తులకు పునర్జీవం పోసేందుకు నడుంబిగించారన్నారు. కూలీలుగా జీవనం సాగిస్తున్న అనేక మంది వృత్తిదారులను ఓనర్లుగా మార్చేందుకే రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. తెలంగాణ సాకారమైన తర్వాత రజక, నాయీబ్రాహ్మణ కులవృత్తులను ప్రోత్సహించే క్రమంలో ఇప్పటికే ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించి, నెలకు 250 యూనిట్లు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం స్ఫూర్తితోనే బీసీ కులాల్లో కులవృత్తులు చేసుకుంటున్న వారందరికీ సాయమందించాలనే ఆలోచనతో బృహత్తర పథకానికి సీఎం కేసీఆర్ నాంది పలికారన్నారు. మానవ మనుగడ ఉన్నన్ని రోజులు అన్ని వృత్తులు కూడా అవసరమేనని, అందుకే కల్యాణలక్ష్మి తరహాలో ఈ పథకం కూడా నిరంతరాయంగా అమలవుతుందని పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిప ల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీలు రామేశ్వర్రెడ్డి, మహిపాల్, జడ్పీటీసీలు ఓస రాజేశ్వర్, జీవన్రెడ్డి, నాయకులు రాంకిషన్రెడ్డి, ధర్మాజి రాజేందర్, మారుగొండ రాము, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి వీ లోకేశ్వర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంలోని గాంధీచౌక్లో ఇన్ని రోజులు మా అన్న దుకాణంల పనిజేసిన. నాకు అన్ని రకాల నగలు తయారీ వచ్చు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయలతో సొంతంగా బంగారు దుకాణం పెట్టుకుంట. నేను 10వ తరగతి చదువుతున్న. ఇద్దరు పిల్లలున్నరు. ఇలా ఒకరి దగ్గర ఎన్ని రోజులు పని చేసుకోవాలే. రేపు పిల్లల భవిష్యత్ ఎట్లా..? అన్న దిగులుండేది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన సాయంతో జీవితానికి భరోసా దొరికింది. ఆయనను జీవితంల మర్చిపోను. జిల్లాలో మొట్టమొదటి చెక్కు నాకే ఇచ్చిన్రు. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్న.
– నాంపెల్లి రాఘవేంద్ర, విశ్వబ్రాహ్మణుడు, ఎల్లపెల్లి
మా నాన్న సాయన్న, నేను ఇద్దరం కలిసి కులవృత్తి చేసుకుంటూ బతుకుతున్నం. ఇన్ని రోజులు ఊరిలోని చెట్టు కింద కూర్చొని గ్రామస్తులకు గడ్డం, వెంట్రుకలు తీసేది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయలతో రోడ్డు పక్కన టేలా వేసుకొని కుర్చీలు, ఇతర వస్తువులను తెచ్చుకుంటం. ఇన్ని రోజులుగా రోడ్డుమీద ఉన్న మా బతుకులకు సీఎం కేసీఆర్ సారు కొండంత భరోసా ఇచ్చిండు. రెండేళ్ల కింద మా చెల్లెలు స్రవంతి పెండ్లికి కల్యాణలక్ష్మి కింద లక్ష వచ్చినయ్. మా ఒక్క కుటుంబానికే ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు లక్షలు సాయం చేసింది.
– ఉల్లెంగల నరేందర్, నాయీ బ్రాహ్మణుడు, లోకల్ వెల్మల్
ఇంతకుముందు మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ సారు వచ్చినంకనే మా అసొంటోళ్లకు అంతా మంచి చేస్తున్నడు. నేను రోజు పది మంది ఇండ్లల్ల బట్టలు ఉతకడానికి పోత. వాళ్లిచ్చే పైసలతో కుటుంబాన్ని పోషించుకుంటున్న. ఇద్దరు ఆడ పిల్లలు. ఆదిలాబాద్లోని గురుకుల స్కూళ్ల సదువుతున్నరు. నా భర్త చిన్నరాజన్న కూడా ఇదే పని చేస్తడు. మా ఇద్దరికీ ఇస్త్రీ పని వస్తది. ప్రభుత్వం ఇచ్చిన లక్షతో ఇస్త్రీ దుకాణం పెట్టుకుంటం. పొద్దున బట్టలు ఉత్కపోతం. సాయంత్రం ఇస్త్రీ జేస్తం. ఇంత పెద్ద సాయం జేసిన కేసీఆర్ సారును ఎన్నటికీ మరువం.
– గఢ్చంద లక్ష్మి, రజక వృత్తిదారు, వెంగ్వాపేట