కుమ్రం ఆసిఫాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు వైద్యశిబిరాల్లో చికిత్స చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి అన్నారు. ఈనెల 18 నుంచి నిర్వహించనున్న కార్యక్రమంపై ఆదివారం తాటియా గార్డెన్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని 100 రోజులపాటు నిరంతరంగా నిర్వహించాలని అన్నారు. 26 బృందాల ద్వారా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని, వైద్యం కోసం వచ్చే రోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్స్ కంటి వెలుగుపై విస్తృతమైన ప్రచారం కల్పించాలన్నారు. ఈనెల 12వ తేదీలోగా కంటి వెలుగు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో వైద్యుల పోస్టులను ఇటీవలే భర్తీ చేసిందని తెలిపారు. జీవో 58 ప్రకారం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ త్వరలోనే ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ రెండో విడుత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వైద్య సిబ్బంది, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులతో కలిసి విజయవంతం చేస్తామన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలో ప్రచారం చేపడుతామన్నారు. శిబిరాల వద్ద టెంట్లు, తాగునీటి వసతితోపాటు ఇతర వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, రాజేశం పాల్గొన్నారు.