సోన్, ఏప్రిల్ 7 : శ్రీరామ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి సరస్వతి కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీరు అందుతున్నది. దీని పరిధిలో సోన్, నిర్మల్ రూరల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 36 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. యాసంగి సీజన్లో వరి వేయగా.. ప్రస్తుతం పొట్టదశలో పంటలు ఉన్నాయి. ఈ పంటలకు మూడు రోజుల క్రితం సరస్వతి కెనాల్ ద్వారా నీటిని నిలిపివేశారు. రెండు, మూడు వారాల్లో కోతకు వచ్చే అవకాశం ఉండగా.. ప్రస్తుతం నీటిని నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రధానంగా రైతులు మోటార్లు, కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. కాలువల ద్వారా నీరు రాక, భూగర్భ జలాలు అడుగంటి వరి గింజ తాలుగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పొలాలు చేతికొస్తాయనుకున్న సమయంలో మళ్లీ నీటి కొరత మొదలైందని రైతులు వాపోతున్నారు. ఈ కెనాల్ ద్వారా నీటిని కొన్నిరోజుల వరకు వదిలితే గింజ గట్టిపడే అవకాశం ఉంటుందంటున్నారు. అసలే ఎండలు మండుతున్న తరుణంలో నీటిని రోజు అందిస్తేనే తడి దిగుతోందని, తడి ఎత్తిపోతే మళ్లీ నీరు ఎండకు పారకం దిగే అవకాశం ఉండదనంటున్నారు.
గతానికి భిన్నంగా..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నీటిని వారబందీ పద్ధతిలో విడుదల చేసేవారు. ఇలా చేయడం వల్ల నీటిని తగినంత వాడుకునే వెసులుబాటు ఉండేది. నీటి పారుదలశాఖ అధికారులు వరుసగా నీటిని విడుదల చేయడంతో అవసరానికి మించి నీటి వినియోగం జరిగింది. దీంతో ప్రాజెక్టు రిజర్వాయర్లో నీటిమట్టం గతానికి కంటే తగ్గిపోయింది. దీంతో నీటి కొరత ఏర్పడి ప్రస్తుతం నీటి విడుదలను ఆపివేయడంతో పంట దెబ్బతిననుంది. వారబందీ పద్ధతి అమలు చేసి ఉంటే.. తగినంత నీరు సరిపోయేదని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఎండిన వరి పైరు..
దస్తురాబాద్, ఏప్రిల్ 7 : భూగర్భజలాలు అడుగంటడంతో బావులు, బోర్లలో నీరు ఇంకిపోతున్నది. చేతికందే దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అప్పులు చేసి కొత్తగా బోర్లు వేస్తున్న, వ్యవసాయ బావుల్లో పూడికతీత తీసిన లాభం లేకుండా పోతున్నది. కొద్ది రోజుల్లో చేతికొస్తుందనుకున్న దశలో నీళ్లు సరిపోక పంటలు ఎండిపోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న పైరు కళ్ల ముందే ఎండిపోతున్న అన్నదాతలు ఏమి చేయలేక పోతున్నారు. ఇందుకు సాక్ష్యం మండలంలోని పెర్కపల్లె గ్రామంలో చేతికొచ్చి వట్టిపోతున్న వరి పంట దృశ్యాలే. ఎండిన పంటను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
20 రోజులు నీరు అందించాలి..
సోన్, ఏప్రిల్ 7 : ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉంది. సరస్వతి కాలువ ద్వారా రెండెకరాల వరకు వరి వేసిన. పొట్ట దశలో వరి ఉండగా.. నీటిని బంద్ చేశారు. ఇంతకుముందు వారబందీ పద్ధతిలో నీటిని అందించి కోత వచ్చే వరకు అందించేవారు. ఇప్పుడు ముందుగానే నీటిని ఆపివేయడంతో పొట్ట దశలో ఉన్న వరి ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు ఎకరానికి రూ.25 వేల వరకు ఖర్చు చేశా. ఈ పంటను కాపాడుకోవాలంటే అధికారులు, నాయకులు స్పందించి మరో 20 రోజుల వరకు నీటిని అందించాలి.
– ప్రవీణ్, రైతు, లోకల్ వెల్మల్.
ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు నీటిని విడుదల చేస్తాం..
సోన్, ఏప్రిల్ 7 : వరి పొట్ట దశలో ఉన్నమాట వాస్తవమేనని మా దృష్టికి వచ్చింది. అయితే రిజర్వాయర్లో తాగునీటి కోసమే నిల్వ ఉంచాం. ఇప్పటికే సరస్వతీ కెనాల్ ద్వారా సాగునీటి విడుదల కోసం విజ్ఞప్తులున్నాయి. వరి సాగు చేసిన రైతులు పంట తుది దశలో ఉందని విన్నవించారు. ఈ క్రమంలో నీటి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు నడుచుకుంటాం. ఆయకట్టు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– జీ శ్రీనివాస్, ఎస్ఈ, ఎస్సారెస్పీ