కుభీర్ : విద్యార్థులు చిన్ననాటి నుంచే సామాజిక, సాంకేతిక ( Technology ) అంశాలతోపాటు ప్రభుత్వ శాఖలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని ఎంపీడీవో సాగర్ రెడ్డి ( MPDO Sagar Reddy ) సూచించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం బెల్గాం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు క్షేత్ర పర్యటనలో భాగంగా మండల కేంద్రం కుభీర్లోని ప్రభుత్వ కార్యాలయాల సందర్శన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మండల పరిషత్, పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, విద్యుత్ సబ్స్టేషన్, మార్కెట్ కమిటీ తదితర ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. ఎంపీడీవో సాగర్ రెడ్డి విద్యార్థులకు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలు, ఉద్యోగుల విధులను వివరించారు.
ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం గంగసాగర్, పంచాయతీ కార్యదర్శి కమల్ సింగ్, ఉపాధ్యాయులు మహేష్, ప్రవీణ్, సాయికుమార్, ఎస్సై కృష్ణారెడ్డి, పీహెచ్సీ వైద్యుడు విజయ్, పశు వైద్యాధికారి విశ్వజిత్ పటేల్ , అధికారులు , విద్యార్థులు ఉన్నారు.