సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. 2007 సంవత్సరం నుంచి 567 మంది పని చేస్తుండగా.. వీరందరికీ రెగ్యులరైజ్ ఉత్తర్వులు విడుదల కానుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలకులు వెట్టిచాకిరీ చేయించుకున్నారని, బీఆర్ఎస్ సర్కారు సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని సంబుర పడుతున్నారు. సీఎం కేసీఆర్ రెగ్యులర్ టీచర్లతో సమానమైన గౌరవాన్ని, సెలవులను ఇస్తున్నారని, పీఆర్సీని వర్తింపజేశారని, 12 నెలల పూర్తి జీతాన్ని ఇవ్వడంతోపాటు 2007 నుంచి ఉన్న బకాయిలు చెల్లించారని, తాజా నిర్ణయంతో మా జీవితాల్లో వెలుగులు నింపారంటున్నారు. నిర్మల్ జిల్లాలో 13, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో 14, ఆదిలాబాద్ జిల్లాలో 12 మంది.. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 40 మందికి మేలు జరగనుంది.
– మంచిర్యాల, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవలే ఆర్టీసీ కార్మికులు, వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించిన తెలంగాణ సర్కారు.. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల టీచర్లకు తీపికబురు అందించింది. 2007 సంవత్సరంలో గురుకులాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులైన 567 మందిని క్రమబద్ధీకరించనుంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల కానుండడంతో ఏండ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తూ, ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్న టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదహారేండ్ల తమ నిరీక్షణ, కష్టాన్ని గుర్తించి రెగ్యులర్ చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానం గా పని చేసినా.. గత కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రపు జీతా లు ఇచ్చి చేతులు దులిపేసుకుందని, సంవత్సరంలో 10 నెలల జీతం మాత్రమే ఇచ్చి, రెగ్యులర్ వాళ్లతో సమానంగా సెలవులు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుందని వాపోయారు. తెలంగాణ ఏర్పడ్డాకే మా కష్టాలను చూసిన సీఎం కేసీఆర్ రెగ్యులర్ టీచర్లతో సమానమైన గౌరవాన్ని కల్పించారంటున్నారు. మాకు పీఆర్సీని వర్తింపజేయడం, 12 నెలల పూర్తి జీతాన్ని ఇవ్వడంతోపాటు 2007 నుంచి ఉన్న బకాయిల చెల్లింపు, రెగ్యులర్ ఉపాధ్యాయ ఉద్యోగులతో సమానంగా సెలవులు ఇచ్చారన్నారు. ఇప్పుడు మరోసారి మమ్ములను మరిచిపోకుండా రెగ్యులరైజ్ చేశారని సంబురపడుతున్నారు. కేసీఆర్తోనే రాష్ర్టానికి మేలు జరుగుతుందని.. ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టే మా లాంటి చదువుకున్న పేదలకు ఈ రోజు న్యాయం జరిగిందని చెబుతున్నారు. 567 మందిలో 507 మంది మహిళా టీచర్లే ఉన్నారని, సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో మా జీవితాల్లో వెలుగులు నింపారంటున్నారు. నిర్మల్ జిల్లాలో 13 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో 14 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 12 మంది ఉపాధ్యాయులు రెగ్యులరయ్యారు. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 40 మందికి మేలు జరుగనుంది.
బెల్లంపల్లి రూరల్, ఆగస్టు 28: గురుకులాల్లో పని చేస్తున్న కాంటాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబాల్లో ఎంతో ధైర్యం నిండింది. 2010 నుంచి బెల్లంపల్లి సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో కాంటాక్ట్ పద్ధతిలో పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. చాలా ఆనందంగా ఉన్నా. మా సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మరింత ఉత్సాహంతో పని చేసి గురుకులాలకు వన్నె తెస్తాం.
– తోట రాధారాణి, పీఈటీ, బెల్లంపల్లి సంక్షేమ బాలికల కళాశాల
నిర్మల్ టౌన్, ఆగస్టు 28 : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2008లో చేరిన. 15 ఏండ్లుగా గణితం బోధిస్తున్న. ఇన్నాళ్లూ తక్కువ వేతనంతోనే పని చేసిన. ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పడంతో కేసీఆర్పై నమ్మకం ఏర్పడింది. ఎన్ని రోజులకైనా తమ ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని ఆశతో ఎదురుచూశాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాపై దయచూపి రెగ్యులర్ చేస్తూ ఫైలుపై సంతకం చేసిన్రు. ఇది విన్నాక నాతోపాటు మా కుటుంబ మంతా ఎంతో సంతోష పడ్డది. మరింత అంకితభావంతో పని చేస్తా.
– రామగిరి సరిత, నిర్మల్, సీఆర్టీ, జాం
నిర్మల్ టౌన్, ఆగస్టు 28 : మాది నిర్మల్ పట్టణం. పీజీ వరకు చదువుకున్న. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో 2009లో సోషల్ వెల్ఫేర్లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలిగా కాంట్రాక్టు పద్ధతిలో చేరిన. 14 ఏండ్లుగా కష్టపడి పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నం. సీఆర్టీలుగా పని చేస్తున్నప్పటికీ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా బాధ్యతలు నిర్వర్తించాం. ప్రభుత్వం ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించడంతో మా శ్రమకు ఫలితం దక్కింది. ఉద్యోగ భద్రత కల్పించింనందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి రుణపడి ఉంట.
– ఆర్.ప్రసూన్న, లెఫ్ట్ పోచంపాడ్
ఆసిఫాబాద్, ఆగస్టు 28: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో 16 ఏండ్లుగా సీఆర్టీగా విధులు నిర్వర్తిస్తున్న. మా కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్, మాకు న్యా యం చేసిన్రు. మా కలలు సాకారమయ్యే విధం గా మా జీవితాల్లో క్రమబద్ధీకరణతో వెలుగులు నింపిన్రు. ఉద్యోగ భద్రత కల్పించి, ఆయన మాకు దేవుడయ్యిండు. ఇన్నాళ్లకు మా కష్టానికి ఫలితం దక్కింది.
– యాతం శ్రీనివాస్, సీఆర్టీ, ఇంగ్లిష్, సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల