సారంగాపూర్, మార్చి 7 : ప్రభుత్వం మహిళలు, చిరువ్యాపారులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా గ్రామాల్లో ఆహార ఉత్పత్తుల యూనిట్లను నెలకొల్పి తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నది. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా సెర్ప్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసి సబ్సిడీపై రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టారు.
నిర్మల్ జిల్లాలో 231 యూనిట్ల లక్ష్యం..
మహిళల ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 231యూనిట్లు ఇవ్వాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాలోని 18 మండలాల్లో 11,982 స్వయం సహాయ సంఘాలున్నాయి. వీటిలో 1,33,698 సభ్యులున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రతియేటా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు అందిస్తున్నారు. ఈ రుణాలతో కిరాణాషాపులు, బట్టల దుకాణాలు, కుట్టుమిషన్, మెడికల్ షాపులు త దితర చిరువ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నారు. ప్రభుత్వం కేటాయిస్తున్న ఆహార ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి మహిళలకు ప్రాధాన్యమిచ్చి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ ఆహార ఉత్పత్తుల యూనిట్లకు 200 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 46 యూనిట్లకు నిధులు కూడా మంజూరు కాగా, 11 మంది లబ్ధిదారులకు యంత్రాలను అందజేశారు. మిగతా 31 యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది.
ఆహార ఉత్పత్తుల యూనిట్లు ఇవే..
పీఎంఎఫ్ఎంఈ పథకంలో భాగంగా పిండిగిర్ని, నూనె తయారీ, పప్పు, ఆలు చిప్స్, మసాలా తయారీ, బేకిరీ ఉత్పత్తులు తదితర యంత్రాలను యూనిట్ల కింద అందించనున్నారు. ఈ యూనిట్లకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంకు ద్వారా లోన్ను లబ్ధిదారులకు ఇస్తారు. యూనిట్ను బట్టి ప్రభుత్వం లబ్ధిదారుడికి 35 శాతం సబ్సిడీ ఇస్తుంది. ప్రతి నెలా లబ్ధిదారు వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే..
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆహార ఉత్పత్తుల యూనిట్లు మంజూరు చేస్తున్నది. నిర్మల్ జిల్లాకు 231 యూనిట్లు టార్గెట్గా నిర్ణయించారు. ఇప్పటి వరకు 200 మందిని ఎంపిక చేశాం. మిగతా 31 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇందులో 46 మంది లబ్ధిదారులకు సంబంధించి యూనిట్లను గ్రౌండింగ్ కూడా పూర్తి చేశాం. – విజయలక్ష్మి, డీఆర్డీవో, నిర్మల్