మంచిర్యాల, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టిన గృహలక్ష్మి పథకం సర్వే పూర్తయింది. విడుతకు రూ.లక్ష చొప్పున మూడు విడుతల్లో రూ.3 లక్షలు అందించనుండగా.. అధికార యంత్రాంగం ఇంటింటికీ తిరిగి అర్హులను గుర్తించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 2,37,944 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వ నిబంధనల మేరకు 1,54,973 అర్జీలు అర్హత సాధించగా.. 82,971 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు, సిబ్బంది వివిధ కారణాలతో తిరస్కరించారు. తొలి విడుత నియోజకవర్గానికి మూడు వేల గృహాలు ఇవ్వనుండగా.. మిగతా అర్హులకు దశలవారీగా అందించనున్నారు. త్వర లోనే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు.
నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. లబ్ధిదారులు తనకు నచ్చిన డిజైన్లో రెండు పడకలతో ఇంటిని నిర్మించుకునే అవకాశం కల్పించడంతో అర్హులు పోటీపడ్డారు. అదే స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్ర స్థాయిలో సర్వేను ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించారు. దీని కోసం నిరుపేదలు ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించి డబ్బులు ఇవ్వరాదని, నిబంధనల ప్రకారం అర్హులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రకటించడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వే పూర్తి చేశారు.
సర్వే జరిపిన తీరు..
2,37,944 దరఖాస్తులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2,37,944 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1,54,973 దరఖాస్తులు ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత సాధించగా.. 82,971 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు, సిబ్బంది వివిధ కారణాలతో తిరస్కరించారు. అర్హత సాధించిన లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మూడు విడుతల్లో నిధులు మంజూరు చేయనున్నది. ఇందుకోసం ఎప్పటికప్పుడు నిర్మాణం పూర్తయిన ఫొటోలు అప్లోడ్ చేస్తే విడుతకు లక్ష రూపాయల చొప్పున అకౌంట్లో నేరుగా జమ చేసేందుకు వివరాలన్నీ ఆన్లైన్ చేశారు. కాగా.. తొలి విడుత నియోజకవర్గానికి మూడు వేల గృహాలు ఇచ్చేందుకు పూనుకున్నారు. మిగతా అర్హులకు దశలవారీగా గృహలక్ష్మి పథకానికి సంబంధించిన డబ్బులు అందించనున్నారు.