ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ బట్టల షాపులో పని చేసే దివ్య (పేరు మార్చాం)కు 13 ఏళ్లు. 2017లో ఆ బాలికను గుర్తించిన అధికారులు.. పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆరా తీశారు. ఇంట్లో నలుగురం ఆడపిల్లలమని.. అందరినీ చదివించే స్థోమత లేక పనికి పంపుతున్నారని చెప్పింది. వెంటనే ఆమె తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి.. స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె డిగ్రీ ఫస్టియర్ చదువుతుంది. తెలంగాణ సర్కారు వల్లే ఈ రోజు చదువుకోగలుగు తున్నానని ఆనందంగా చెబుతుంది.
‘నా బాల్యం నాకు తిరిగిచ్చేస్తానంటే నా సకల సంపదలూ ధారబోస్తా..’నంటాడో మహానుభావుడు. మనిషి మనోఫలకంపై అందమైన జ్ఞాపకాలను అచ్చేసేదే బాల్యం. దాని విలువ అమూల్యం. దీనిని గుర్తించిన పెద్దలు సైతం తమ పిల్లలను బాల్యపు మధురానుభూతులకు దూరం చేయడం బాధకారం.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి.. వారి భవిష్యత్కు బంగారు బాటలు వేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్.. సత్ఫలితాలనిస్తున్నాయి. ఏడాదికి రెండుసార్లు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ.. వేలాది మంది పిల్లలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి చదువులమ్మ ఒడికి చేరుస్తున్నాయి. గడిచిన ఆరేళ్లలో 6,369 మందిని గుర్తించి విద్యాలయాల్లో చేర్పించగా, పలుగూ పార పట్టిన ఆ చేతులే నేడు అక్షరాలు దిద్దుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న కార్యక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
మంచిర్యాల, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పుస్తకాలు పట్టాల్సిన బాలబాలికలు.. తట్టా పారా పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల్లో పుట్టిన పాపానికి కూలీలుగా మారుతున్నారు. బట్టల షాపులు, కిరాణా దుకాణాలు, ఫ్యాక్టరీలు, మిర్చి బండీలు, హోటళ్లలో పని చేస్తూ.. చదువుకోవాలనే కోరికను కడుపున దాచుకొని పొట్టకూటి కోసం కష్టపడుతున్నారు. ముక్కు పచ్చలారని వయసులో నానా చాకిరీ చేస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. బాల కార్మిక నిర్మూలన చట్టం వచ్చినా ఈ దుస్థితి కనిపిస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం క్రమంగా దాని నుంచి బయటపడాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. బాలకార్మిక వ్యవస్థను నియంత్రించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గడిచిన ఆరేళ్లలో వేలాది మంది బాల కార్మికులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి ప్రసాదించి.. చదువులమ్మ ఒడికి చేరుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న కార్యక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఏడాదికి రెండుసార్లు డ్రైవ్..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం కింద యేటా రెండుసార్లు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఏడాది ప్రారంభం జనవరి, మధ్యలో జూలైలో రెండు నెలల పాటు బాలకార్మికులుగా మారిన పిల్లలను గుర్తిస్తున్నారు. ఈ రెండు నెలలకే పరిమితం కాకుండా జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పిల్లలను గుర్తించి వారికి విముక్తి కల్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో నియోజవర్గానికో టీమ్ చొప్పున పని చేస్తున్నది. పోలీసు శాఖ సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రతి టీమ్లో ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ అధికారి, కార్మిక శాఖ అధికారి మొత్తం ఏడుగురు ఉంటారు. వారికి కేటాయించిన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల కార్మికులను గుర్తించడం, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి చదువుకునేలా చేయడం, తల్లిదండ్రులు లేని పిల్లలైతే వారిని చేరదీసి ప్రభుత్వమే వారిని చదివించేలా చర్యలు తీసుకోవడం ఈ బృందాల కర్తవ్యం.
6,369 మంది గుర్తింపు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆరేళ్లలో 6,369 మంది బాలకార్మికులను గుర్తించారు. వీరిలో బాలురు 4,798 మంది, బాలికలు 1,571 మంది ఉన్నారు. ఇందులో 5,745 మంది పిల్లల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ పిల్లలను స్కూళ్లలో చేర్పించారు. తల్లిదండ్రులు లేని, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న 624 మంది పిల్లలను ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో ఉంచారు. బాల కార్మికులు ఎక్కువగా బేకరీలు, బట్టల షాపులు, ఫ్యాక్టరీలు, ప్రూట్స్ షాపులు, మిర్చీ బండీలు, హోటళ్లు, చిరువ్యాపారాలు చేసే సెంటర్లలో ఉంటున్నారు. 14 ఏళ్లలోపు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకోకూడదనే నిబంధనను పట్టించుకోని యాజమాన్యలపై కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ఎనిమిదో విడుత ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ పూర్తికాగా, ప్రస్తుతం రెండో విడుత మొదలైంది.
పకడ్బందీగా అమలు చేస్తున్నాం
జిల్లాలో తొమ్మిదో విడుత ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్లో మూడు ప్రత్యేక బృందాలు ఇందుకోసం పని చేస్తున్నాయి. గడిచిన కొద్ది రోజుల్లోనే ఐదుగు రు బాలకార్మికులను గుర్తించాం. వారిని బడుల్లో చేర్పించాం. దొరికిన పిల్లలను ఒకసారి బడిలో చేర్చి వదిలేయకుండా మానిటరింగ్ చేస్తున్నాం. ఎప్పటి కప్పుడు వారి తల్లిదండ్రులతో మాట్లాడి అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. ఇందులో పోలీసుశాఖ కీలకంగా వ్యవహరిస్తున్నది. బేటీ బచావో.. ఆందోళన్ (బీబీఏ)లాంటి స్వచ్ఛంద సంస్థలు మాతో కలిసి పని చేస్తున్నాయి.
– కొట్టె చిన్నయ్య, జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ అధికారి, మంచిర్యాల