ఆదిలాబాద్ : జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పథకం (Best Available Scheme) లో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి సోమవారం ఆదిలాబాద్(Adilabad) కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో తమ పిల్లలను పాఠశాలలకు అనుమతించడం లేదని ఆరోపించారు.
దసరా సెలవుల తర్వాత పిల్లలను స్కూల్లో దింపి రావడానికి వెళ్తే రావద్దంటున్నారంటూ తల్లిదండ్రులు వాపోయారు. టీసీలు ఇవ్వాలని కోరినా పాఠశాల యాజమాన్యాలు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేయకపోతే తాము ఏమి చేయలేని పరిస్థితి ఉందని అధికారులు సమాధానం ఇస్తున్నారని తెలిపారు. పాఠశాలలకు నిధులు విడుదల చేసి పిల్లల చదువులు కొనసాగేలా చూడాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.