నార్నూర్, జనవరి 5 : నాగోబా మహాపూజ(జనవరి21)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం ప్రారంభమైన మెస్రం వంశీయుల పాదయాత్ర గురువారం గాదిగూడ మండలం సాంగ్వీ పంచాయతీ పరిధిలోని గణేశ్పూర్కు చేరుకుంది. బుధవారం రాత్రి బొడ్డిగూడలో బస చేశారు. మెస్రం వంశీయులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఝరికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం గాదిగూడ మండలంలోని గణేశ్పూర్కు కాలినడకన వెళ్లారు. గాదిగూడ, హిరాపూర్ గ్రామాల్లో భేటింగ్ అయ్యారు.
ఆ గ్రామాల్లో నిలకడ పూజలు చేశారు. అక్కడి నుంచి సాయంత్రం గణేశ్పూర్కు చేరుకోగా.. ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు. వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం గణేశ్పూర్ నుంచి కుమ్రం భీం జిల్లా జైనూర్ మండలంలోని లేడిజాడ చేరుకొని బస చేయనున్నట్లు ఆ వంశీయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదిప్రధాన్ మెస్రం దాదారావ్, ఖాటి కటోడ మెస్రం కోసు, కటోడ మెస్రం శేకు, ఝడ్యా మెస్రం బొజ్జు, గాయికి మెస్రం దేవ్రావ్, నాయిక్వాడి మెస్రం ధర్ము, సంక్కేపల్లి మెస్రం శాందుర్రావ్, వాడి మెస్రం జంగు, జోప్పా మెస్రం శేకు, ప్రధాన్ నాగోబా పెన్ కోత్వాల్ మెస్రం తిరుపతి, గ్రామపెద్దలు ఉన్నారు.