ఉట్నూర్, అక్టోబర్ 28 : ముఖ్యమంత్రి కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు హెలికాప్టర్లో స్థానిక కుమ్రం భీం ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి స్థానిక ఎంపీడీవో మైదానంలో ఏర్పాటు చేసిన సభాస్థలానికి చేరుకొని మాట్లాడారు. ఒక్కసారి చాన్స్ కావాలంటోంది కాంగ్రెస్.. గతంలో పదకొండు సార్లు గెలిపిస్తే ఏం చేశారో చెప్పాలన్నారు. ఏజెన్సీలో ఒకప్పుడు విషజ్వరాలు ప్రబలి మరణాలు సంభవించేవి. జ్వరాలు రాకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలాన్ని అందిస్తున్నాం.
కేసీఆర్ పథకాలతో గ్రామాల్లో పారిశుధ్యం, చెట్ల పెంపు, రోడ్ల నిర్మాణాలతో గ్రామాల రూపురేఖలు మార్చామన్నారు. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచినంక ఏం చేస్తుందో చూడాలన్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూడా మూడు గంటల కరెంట్ ఇవ్వలేక పోతుందన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం ఆగం అవుతది. 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలో…రాష్ర్టాన్ని ఆగం చేసే పార్టీలు కావాలో ప్రజలే తెల్చుకోవాలి.
ఏజెన్సీలో గిరిజనేతరులకు అసైన్డ్ ల్యాండ్స్కు పూర్తి హక్కులు ఇస్తామన్నారు. గిరిజనేతరులు ఇండ్లు కట్టుకునేందుకు హక్కు కల్పిస్తాం. క్రయ, విక్రయాలకు అవకాశాలు కల్పిస్తాం. గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచాం. కార్యకర్తలు గడప గడపకూ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఐకే రెడ్డి, శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్, ఉమ్మడి జిల్లా ఎంఎల్సీ దండె విఠల్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు రవీందర్, మాజీ ఎంపీ నగేశ్, ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావు పాల్గొన్నారు.
గతంలో పనిచేసిన వాళ్లు కమీషన్లకు కక్కుర్తి పడ్డారని.. ఇప్పడు జాన్సన్ నాయక్ చదువుకున్న వ్యక్తి అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. తనకు అమెరికాలో ఐటీ కంపెనీ ఉందని అయినా సేవ చేసేందుకు వచ్చాడన్నారు. కేటీఆర్ మిత్రుడైన జాన్సన్ నాయక్ మా ఫ్యామిలీ సభ్యుడన్నారు. తనను ఉట్నూర్కు 100పడకల ఆసుపత్రిగా పెంచే వరకు విడువలేదన్నారు. బాల్క సుమన్ కూడా తమ ఫ్యామిలీ సభ్యుడని, తనకు చెన్నూర్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే చాలా అభివృద్ధి చేసి చూపిస్తున్నాడన్నారు. అలాగే జాన్సన్ నాయక్ కూడా అవకాశం ఇవ్వాలని కోరారు.
పైగా జాన్సన్ నాయక్కు ఐటీ కంపెనీతోపాటు నిధులు తెచ్చి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయించగ ల సత్తా ఉందన్నారు. జాన్సన్ నాయక్ను గెలిపించండి ఐదేండ్ల వరకు సేవకుడిగా పనిచేస్తాడన్నారు. ఉట్నూర్ పట్టణంలో కుమ్రం భీం ప్రాంగణం నుంచి ఐటీడీఏ వరకు నాలుగు వరుసల రహదారి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తాం. కుప్టి ప్రాజెక్ట్ నిర్మిస్తాం, కడెం ప్రాజెక్ట్, సరస్వతి కాలువలను ఆధునీకరిస్తాం, సేవాలాల్ భవనం, దళిత భవనాలు నిర్మిస్తామన్నారు. కాగా.. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఉపేందర్, రాజమణి, అహ్మద్లతోపాటు పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి హరీశ్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఏజెన్సీలోని గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూ ములకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్ది అని మంత్రి ఐకేరెడ్డి అన్నారు. జాన్సన్ నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు గిఫ్ట్గా ఇస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. తనపై నమ్మ కం ఉంచిన కేసీఆర్, కేటీఆర్లకు రుణపడి ఉంటామన్నారు. గిరిజన బిడ్డగా గిరిజనులను, యువతకు మంచి అవకాశాలు కల్పిస్తూ అందరి నమ్మకాన్ని నిలబెడతానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తానన్నారు. భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపిస్తే కేసీఆర్ మరోసారి సీఎం అయి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా చేస్తారన్నారు.