రాష్ట్ర ప్రభుత్వము కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నది. వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నార్మల్ డెలివరీలను పెంచాలని సూచిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లోని మాతా, శిశు సంరక్షణ ఆస్పత్రుల ఏర్పాటు, జనరల్ ఆస్పత్రుల్లో బెడ్స్ పెంపునకు చర్యలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి గర్భిణుల నమోదు, మానిటరింగ్, అవసరమైన మందులు సరఫరా చేయడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గతేడాది 2021-22తో పోలిస్తే ఈ సంవత్సరం 2022-23లో సాధారణ ప్రసవాలు రెండు శాతం పెరిగాయి.
– మంచిర్యాల, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తాం..
ప్రైవేటు ఆస్పత్రుల ధనదాహంతోపాటు కుటుంబ సభ్యుల ఆలోచన విధానం సిజేరియన్ డెలివరీలకు కారణం అవుతున్నది. మంచిర్యాల జిల్లాలో ప్రతి యేడాది 1200 ప్రసవాలు అవుతుండగా.. ఇందులో 300 నుంచి 400 నేరుగా ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నాయి. మిగిలినవన్నీ ప్రైవేటుకు వెళ్తున్నాయి. నార్మల్ డెలివరీలు పెరగాలంటే ప్రైవేటు ఆస్పత్రుల సహకారం తప్పకుండా ఉండాలి. ఈ విషయంలో కఠినంగా వ్యవ హరించాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే వారితో సమావేశం నిర్వహిస్తాం. గ్రామాల్లో ఏఎన్ఎంల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. సాధారణ ప్రసవాలు చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు, సిజేరియన్లతో వచ్చే ఇబ్బందులను గర్భిణులకు వివరిస్తున్నాం. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నార్మల్ డెలివరీల సంఖ్య పెంచడంలో సఫలమ య్యాం. ఈ సంఖ్యను ఇంకా పెంచేందుకు మా వంతు కృషి చేస్తాం.
– సుబ్బారాయుడు, డీఎంహెచ్వో మంచిర్యాల.
తీరు మార్చుకోని ప్రైవేటు దవాఖానలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గతేడాది 45,286 ప్రసవాల్లో 18,903 నార్మల్ డెలివరీలు అయ్యాయి. ఇందులో 26,383 ఆపరేష న్లు జరగ్గా.. 16,799 సిజేరియన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరిగాయి. ఈ యేడాది ఇప్పటివరకు 25,342 ప్రసవాల్లో 14,300 సిజేరియన్లు ఉండగా 8,224 ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరిగాయి. గవర్నమెంట్ దవాఖానల్లో అత్యవసరమైతే తప్పా సిజేరియన్లు చేయడం లేదు. కానీ.. ప్రైవేటులో డెలివరీ తేదీకి రెండు నుంచి మూడు వారాల ముందుగానే సీ-సెక్షన్ (సిజేరియన్లు/ఆపరేషన్లు) చేస్తున్నారు. సీరియస్నెస్ క్రియేట్ చేసి ఆపరేషన్లు చేసుకోవాలని భయపెడుతున్నారు. దీంతో ప్రభుత్వం నియంత్రించినా ప్రైవేటులో ఆపరేషన్లు ఆగడం లేదు. తాజాగా.. నిర్వహించిన సమీక్షలో ఈ విషయంపై వైద్యారోగ్యశాఖ సీరియస్ అయ్యింది. దీంతో జిల్లా అధికారులు తమ పరిధిలోని అన్ని ప్రైవేటు మెటర్నిటీ ఆస్పత్రుల వైద్యులతో ప్రత్యేక సమావేశం ఏ ర్పాటు చేసి అకారణంగా చేస్తున్న ఆపరేషన్లను ఆపాలని, సాధారణ ప్రసవాలు పెంచాలని ఆదేశించనున్నారు. ఇప్పటివరకు చేసిన డెలివరీలపై నివేదికలు తెప్పించి అవసరం లేని కేసు ల్లో ఎందుకు ఆపరేషన్లు చేశారనే విషయా న్ని ఆరా తీయనున్నారు. సరైన సమాధానం చెప్పని ఆస్పత్రుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి, వాటి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు సాధారణ ప్రసవాలను పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు.
కుటుంబ సభ్యుల ఆలోచన మారాలి..
సిజేరియన్ డెలివరీలకు పరోక్షంగా ఆడపిల్ల తల్లిదండ్రులు, భర్తలు కారణం అవుతున్నారు. “లక్షల రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. ఈ ఒక్క కాన్పు వెళ్లదీస్తే అయిపోతది. ప్రభుత్వ దవాఖానకు పోవడం ఎందుకు? ఓ లక్ష రూపాయలు పోయినా ప్రైవేటులోనే చేపిస్తాం” అనే భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. దీనికి గర్భిణుల భర్తల సపోర్ట్ కూడా ఉంటుంది. రిస్క్ తీసుకోవడం ఎందుకూ.. ఎలాగూ ప్రైవేటుకు వెళ్తున్నాం కదా ఆపరేషన్ చేయిద్దామనే చాలా మంది అనుకుంటున్నారు. దీనికి తోడు ముహూర్తాలు కూడా చూపించి సిజేరియన్ డెలివరీలు చేయిస్తున్నారు. డెలివరీ తేదీ బాగో లేదు. మంచి రోజు చూసుకొని చేపిద్దామని డాక్టర్ల వద్దకు పైరవీలకు వెళ్లే వారు ప్రతి పది మందిలో ముగ్గురు నుంచి నలుగురు ఉంటున్నారు. నా బర్త్ డే, నాకు పుట్టబోయే వారి బర్త్ ఒకే రోజు ఉండాలని, వారాలు నిండకముందే ఆపరేషన్లు చేయిస్తున్న వారు చాలా మంది ఉంటున్నారు. ఈ కారణాలన్ని కూడా నార్మల్ డెలివరీలను సిజేరియన్లుగా మారుస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలానికి చెందిన ఓ గర్భిణి డెలివరీకి మూడు వారాల ముందు చూపించుకోడానికి ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అప్పటివరకు ప్రతినెలా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చూపించుకుంది. ఎందుకైనా మంచిదని ప్రైవేటు వైద్యురాలి దగ్గరికి వెళ్లింది. పరీక్షలు చేసిన వైద్యురాలు “బిడ్డ బాగా కిందకు జారింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. లేకపోతే బిడ్డకు ప్రమాదమని హెచ్చరించింది.” విషయం తెలుసుకున్న ఏఎన్ఎం గర్భిణీకి ఎలాంటి సమస్య లేదని, ఆపరేషన్ చేస్తే అధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ వైద్యురాలిని హెచ్చరించింది. వెంటనే గర్భిణి భర్త ఫోన్ చేసి “మేం ఆపరేషన్ చేయించుకుంటాం. మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు. నా బిడ్డకు ఏమైనా అయితే మీ మీద, జిల్లా వైద్యాధికారుల మీద కేస్ పెడుతానంటూ బెదిరించాడు.” ఎంత చెప్పినా వినకుండా ఆపరేషన్ చేయించాడు. బిడ్డ రెండు కిలోల బరువుతో పుట్టింది. దీంతో బిడ్డను కొన్ని రోజులపాటు బాక్స్లో పెట్టి రూ.8 లక్షల బిల్లు వేసి డిశ్చార్జి చేశారు.
నార్మల్ డెలివరీలే మేలు
సాధారణ కాన్పులు తల్లీబిడ్డకు క్షేమకరం. నాలుగైదు గంటలు పురిటి నొప్పులు భరిస్తే.. భవిష్యత్తులో ఇబ్బం దులు తప్పుతాయి. నార్మల్ డెలివరీ వల్ల రక్తస్రావం తక్కువ. మొదటిసారి సహజ ప్రసవం అయితే రెండోసారి కూడా సుఖప్రసవం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుం ది. కాన్పు జరిగిన మూడు నాలుగు రోజుల నుంచే తన పనులు తాను చేసు కోవడానికి వీలుంటుంది. బిడ్డ పుట్టిన గంటలోగా ముర్రుపాలు తాగించే అవకాశముంటుంది. శిశువుకు వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. వ్యాధు ల బారిన పడే అవకాశం తక్కువ. పుట్టే పిల్లల్లో తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వెనుకటి తరం వాళ్లు సహజ ప్రసవాల వైపే మొగ్గు చూపేవారు. గర్భం ధరించింది మొదలు మహిళలను సాధారణ ప్రసవానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసే వారు.
సిజేరియన్లతో నష్టాలు..
సిజేరియన్ వల్ల తల్లీబిడ్డలకు నష్టం. ఈ ఆపరేషన్కు గంట సమయమే తీసుకున్నా.. భవిష్యత్తులో తల్లి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలో నాలుగైదు లేయర్లు కట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే గర్భాశయం నుంచి బిడ్డను బయటికి తీయడం సాధ్యమవుతుంది. రక్తస్రావం కూడా అవుతుంది. పైగా సిజేరియన్ తర్వాత గాయం మానడానికి చాలా సమయం తీసుకుంటుంది. కనీసం మూడు నెలలపాటు విశ్రాంతి అవసరమవుతుంది. ఆ లోగా తగిన జాగ్రత్తలు, పోషకాహారం తీసుకోకపోతే హెర్నియా, కడుపు నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. పుట్టిన బిడ్డకు గంటలోగా ముర్రుపాలు తాగించాలి. అవి అమృతంతో సమానం. సిజేరియన్ వల్ల ముర్రుపాలు పట్టించే అవకాశమే లేకుండా పోతున్నది.