కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలన్న ఆశలో రైతులు పొలాల్లో హానికర రసాయనాలు, ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయే తప్పా దిగుబడులు మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచేలా ప్రకృతి సేద్యం వైపు రైతులను మళ్లీంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని 500 మంది గిరిజన రైతులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి ‘ప్రకృతి వ్యవసాయం’ చేయించేందుకు సన్నహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 78.25 లక్షలను కూడా ఖర్చుచేయనున్నారు.
పెట్టుబడుల భారాన్ని తగ్గించేలా రైతుబంధు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఆయిల్ పామ్ తోట, ఉద్యానవనాలను ప్రత్యేక రాయితీల ద్వారా బిందు సేధ్యం వంటి పరికరాలను రాయితీపై అందజేస్తోంది. తక్కువ ఖర్చుతో సాగయ్యే పంటలను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను రాయితీలతో అమలు చేస్తోంది. ఇవేగాకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసే రైతులకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రోత్సహిస్తోంది. పెట్టుబడి భారాన్ని మరింత తగ్గించేలా తాజాగా ‘ప్రకృతి వ్యవసాయాన్ని’ ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలో ఉన్న నాలుగు ఐటీడీఏలు ఉట్నూర్, భద్రాచలం, ఏటూరునాగా రం, మన్ననూర్ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వీటిని అమలు చేయనున్నారు. యేటా ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో 500 మంది గిరిజన రైతులను ఎంపిక చేసి వారికి ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసే పం టలు ప్రకృతి సహజసిద్ధమైన పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. ఇందులో రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం ఏమాత్రం ఉండదు. సహజసిద్ధమైన విత్తనాలతోనే ఈ వ్యవసాయం చేయాల్సి ఉంటుంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం గిరిజన రైతులు పత్తి, సోయా వంటి వాణిజ్య పంటలను మినహాయిస్తే జొన్న, మక్కజొన్న వంటి పంటలను సహజ సిద్ధంగానే సాగుచేస్తున్నారు. కొండ కోనల్లో గిరిజనులు సాగుచేసే జొన్న, మక్కజొన్న వంటి ఆహార పంటలకు చెప్పుకోదగిన విధంగా రసాయన ఎరువులు వినియోగించరు. పత్తి, వరి, సోయా, కూ రగాయలు చేసే రైతులు మాత్రం రసాయన ఎరువులు, పురుగుల మందులను వినియోగిస్తున్నారు. పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. గిరిజ న రైతుల పెట్టుబడులను తగ్గించి ఆరోగ్యకరమై న పంటల సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నది. అంతేగాకుండా అవసరమైన మేరకు ప్రకృతి వ్యవసాయ అభివృద్ధి కోసం కృషిచేసే స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా తీసుకోనున్నది.