సోన్, జూన్ 3 : తెలంగాణ వ్యవసాయం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని, అందుకే దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ఇక్కడి సంక్షేమ పథకాలు ఇవ్వాలన్న డిమాండ్ ఏర్పడిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి వ్యవసాయ క్లస్టర్లో నిర్వహించిన రైతు వేదికకు ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014కు ముందు, 2023తర్వాత తెలంగాణ ఎలా మారిపోయిందో ఇక్కడి వారందరికీ తెలుసన్నారు. ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటేనే కష్టాల కన్నీళ్లని పేర్కొన్నారు.
వానకాలం, యాసంగి సీజన్లకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.10 వేలు, రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా, యాంత్రీకరణను ప్రోత్సహిస్తూనే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు 24 గంటల కరెంట్ అమలు చేయడంతో ఒకప్పుడు ఐదెకరాలు వర్షాకాలంలో పంటలు పండించిన రైతులు ఇప్పుడు ఒక గుంట భూమి కూడా వృథా ఉండకుండా రెండు పంటలు పండించుకొని ఆర్థిక పరిపుష్టి చెందుతున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దేశంలో ఎక్కడైనా 24 గంటల కరెంటు ఇచ్చారా? రైతుబీమా, రైతుబంధు ఉందా? బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఊరిలోకి వస్తే రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు.
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు బహిరంగ సభలు నిర్వహించడంతో అక్కడి ప్రభుత్వం దిగొచ్చి రైతులకు పెట్టుబడి సాయం, రైతులకు కరెంట్ సమయం పెంచిందన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని దేశ ప్రజలందరూ మెచ్చుకుంటున్నా కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, అందుకే కేసీఆర్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ‘అబ్కీబార్..కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకెళ్తున్నామని, ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మల్ జిల్లాలోని 79 వ్యవసాయ క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికల ద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు డ్రోన్ ద్వారా పంటలపై స్ప్రే చేసేవిధానంపై అవగాహన కల్పించారు.
రైతు పక్షపాతిగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నిర్మల్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని రైతులందరూ కుటుంబసభ్యులతో పెద్ద ఎత్తున తరలిరావాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పి లుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవనంతో పాటు రూ.56 కోట్లతో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ సమీకృత భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారని మంత్రి చెప్పారు. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల నుంచి లక్షలాది మంది తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవానికి పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి అల్లోల రైతుగా అవతారమెత్తారు. ఎన్నో సమావేశాల్లో తాను రైతు అని, తనకు వ్యవసాయం అంటే ఎంతో ప్రేమని, వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను నొక్కిచెప్పేవారు. ఈ క్రమంలో మంత్రి కొండాపూర్ నుంచి రైతు వేదిక వరకు రెండు కిలోమీటర్ల మేర ట్రాక్టర్, ఎడ్లబండి ఎక్కి వాటిని నడుపుతూ రైతుకున్న ప్రాధాన్యతను చాటిచెప్పారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే ఎంతో ప్రేమని మంత్రి పేర్కొన్నారు. ట్రాక్టర్, ఎడ్లబండిపై జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దండి విఠల్తో పాటు రైతులు ఉన్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగాఉండడం వల్లే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. రైతు కుటుంబంలో జన్మించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి రైతు పక్షపాతిగా ప్రభుత్వ కార్యక్రమాలను రైతుల వద్దకు తీసుకెళ్లి ఎంతో మేలు చేశారన్నారు. ఆయన చొరవతోనే నిర్మల్ జిల్లాలో 27, 28 ప్యాకేజీ కింద లక్ష ఎకరాల సాగునీరు వస్తుందని తెలిపారు.
నిర్మల్ జిల్లా కావడానికి మంత్రి కారణమని, జిల్లా ఏర్పాటు తర్వాత నిర్మల్ ఎంతో అభివృద్ధి చెందిందని ఇదంతా ప్రజల అదృష్టమని తెలిపారు. ఆదివారం నిర్మల్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నందున పెద్ద ఎత్తున రైతులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల్లో రైతు దినోత్సవం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ గోవర్ధన్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు మల్లేశ్, ముఠాపూర్ పీఏసీఎస్ చైర్మన్ బోండ్ల గంగాధర్, వైస్ చైర్మన్ రాజారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, డీఎల్పీవో రమేశ్, తహసీల్దార్ ప్రభాకర్, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, ఆర్ఐ మోహన్, సర్పంచ్ అల్లోల రవీందర్రెడ్డి, భూమయ్య, మండల వ్యవసాయశాఖ అధికారి వసంత్రావు, ఏఈవో శ్రావ్య, నాయకులు ముత్యంరెడ్డి, మహేశ్రెడ్డి, పోశెట్టి, ముఠాపూర్ గంగారెడ్డి, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.