నిర్మల్ టౌన్, మార్చి 21 : వచ్చే నెలలో జరగనున్న పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పరీక్షల కమిషనర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుగా ఆయా జిల్లాల్లో ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులు, పూర్తయిన, కొనసాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులపై వివరాలు అడిగారు. అనంతరం పదో తరగతి పరీక్షల నిర్వహణపై సూచనలు చేశారు. ఈసారి మొత్తం ఆరు పేపర్లే ఉంటాయని, మూడు గంటల వ్యవధిలో పరీక్షలు రాయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి పరీక్షాకేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. గుర్తింపుకార్డులు లేకుండా లోపలికి ఎవరినీ అనుమతివ్వద్దని తెలిపారు. పరీక్షల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. అనంతరం నిర్మల్ డీఈవో రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 166 ప్రభుత్వ పాఠశాల్లో 6,124 మంది.., 67 ప్రైవేటు పాఠశాలల్లో 2,954 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని వెల్లడించారు. వీరికి 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నిర్మల్ నుంచి పంచాయతీ రాజ్ ఈఈ శంకరయ్య, పరీక్షల నిర్వహణాధికారిణి పద్మ, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.