మంచిర్యాల, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదో తరగతి విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేసేందుకు మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్ వినూత్న ఆలోచన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదుకునే పిల్లలు.. కార్పొరేట్లో చదువుకునే పిల్లలతో పోలిస్తే ఎందులోనూ తక్కువ కాదని నిరూపించేందుకు ‘ప్రతిభ ప్రోత్సాహక పరీక్ష’ నిర్వహిస్తున్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీ రాజ్ కొత్త చట్టంపై ఎగ్జామ్ పెట్టి వార్తల్లో నిలిచిన ఆయన తాజాగా మరో వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థుల్లో పోటీతత్వం పెంచడానికి.. వారిలోని ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపడానికి కొత్తగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రతిభ ప్రోత్సాహక పరీక్ష కాన్సెప్ట్ను తీసుకువచ్చారు.
మొదట జిల్లాలోని 124 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పరీక్ష పెట్టాలనుకున్నారు. కానీ సమయాభావం, ఏర్పాట్లు మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని గత పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురి చొప్పున మొత్తం 620 మందిని ఎంపిక చేశారు. వచ్చే ఏడాది మాత్రం పదో తరగతి చదివే ప్రతి విద్యార్థితో ఈ పరీక్ష రాపిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో మరే జిల్లాలోనూ ఇలాంటి కాన్సె ప్ట్ లేదని ఇది తప్పకుండా విజయవంతం అవుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం నిర్వహించే ఈ పరీక్షపై మరిన్ని వివరాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.
ఒక్కో సబ్జెక్ట్ నుంచి 25 ప్రశ్నలు..
పదో తరగతిలో తెలుగు, హింది, ఇంగ్లిష్, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం ఈ ఆరు సబ్జెక్టుల నుంచి ఒక్కో సబ్జెక్ట్కు 25 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలను సిద్ధం చేశామని తెలిపారు. ఆప్షనల్ విధానంలో పరీక్ష ఉంటుందని పేర్కొ న్నారు. మూడు గంటల సమయం ఉంటుందని, ఇందులో టాపర్లుగా నిలిచే పది మంది విద్యార్థులకు ఏదైనా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ఉచిత సీటు ఇప్పించి మెరుగైన విద్య అందించాలనేది ఆలోచన అని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని కొన్ని కాలేజీల యాజమాన్యాలను సంప్రదించాం. కార్పొరేట్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వారు చెప్పారని, వారి నుంచి ఆమో దం తెలపాల్సి ఉందన్నారు. టాపర్లుగా నిలిచే టాప్-5విద్యార్థులకు తానే స్వయంగా ట్యాబ్లు ఇస్తానని చెప్పారు. ఇంటర్ స్టడీ మెటీరియల్ కూడా ఇప్పిస్తాని వివరించారు. ఆ ట్యాబ్ల ద్వారా వాళ్లకు ఏ సందేహం ఉన్నా తీర్చుకోవచ్చన్నారు. వచ్చే ఏడాది మాత్రం ఈ ప్రతిభా ప్రోత్సాహక పరీక్షలో టాపర్లుగా నిలిచే విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో కచ్చితంగా సీటు ఇప్పి స్తామని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు చేస్తు న్నాం. ఈ జిల్లాలో తాను ఉన్నా.. వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లినా ఈ పరీక్ష ప్రతి ఏడాది కొనసాగుతుందని స్పష్టం చేశారు. అందుకు కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నామని వివరించారు. ఒక మంచి పనికి తప్పకుండా వారి సహకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరీక్ష అయ్యాక ఆ ప్రశ్నాపత్రాన్ని అన్ని పాఠశాలలకు పంపిస్తామని, అక్కడ మిగిలిన పిల్లలతో కూడా రాయిస్తామని చెప్పారు.
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు: 124
ప్రతిభ ప్రోత్సాహక పరీక్ష రాసే పదో తరగతి విద్యార్థులు: 620
తెలుగు మీడియం విద్యార్థులు: 363
ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు: 257
పరీక్ష కేంద్రాలు: 4 (జడ్పీఎస్ఎస్ బజార్ ఏరియా బెల్లంపల్లి, జడ్పీఎస్ఎస్ గర్ల్స్ లక్షెట్టిపేట, జడ్పీఎస్ఎస్ బాయ్స్ మంచిర్యాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల చెన్నూర్)