జైపూర్, సెప్టెంబర్ 10 : శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారంఖని-1ఏ గనిలో మంగళవారం మొదటిషిప్టులో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు ఎల్లవేన శ్రీనివాస్ (35) ఊపిరాడక మృతిచెందాడు. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనిలోని గాంధీనగర్కు చెందిన శ్రీనివాస్ ఐకే-1ఏ మెదటి షిప్టు అండర్గ్రౌండ్లో ఎస్-1 ప్యానల్ 35వ డిప్-4 లెవల్ వద్ద మంగళవారం విధులు నిర్వహిస్తుండగా, గాలి అందక ఉక్కిరి బిక్కిరై కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి అండర్గ్రౌండ్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అంబులెన్స్లో రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. గనిలో వెంటిలేషన్ సరిగా లేకపోవడం వల్లే శ్రీనివాస్ మృతిచెందినట్లు కార్మికులు పేర్కొంటున్నారు.
శ్రీనివాస్ మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ కార్మికసంఘం ఆధ్వర్యంలో గనిపై ధర్నా నిర్వహించారు. నాయకులు, కార్మికులు మాట్లాడుతూ కొంతకాలంగా 34, 35, 53 డిప్లలో గాలి సరఫరా లేదని కార్మికులు యాజమాన్యానికి అనేకసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, శ్రీనివాస్ ఊపిరాడక చనిపోతే గుండెపోటు అని, పిట్స్తో చనిపోయాడని పిట్టకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. గని రక్షణ అధికారితో పాటు ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు తిప్పారపు సారయ్య డిమాండ్ చేశారు.
ఏరియా హాస్పిటల్ ఉన్న శ్రీనివాస్ మృతదేహన్ని ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు పరిశీలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. తన భర్త ఊపిరాడకనే చనిపోయాడని శ్రీనివాస్ భార్య ఎలవేన అనిత జైపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త పని ప్రదేశంలోనే మృతి చెందినప్పటికీ అధికారులు బతికి ఉన్నట్లుగా దవాఖానకు తరలించి వైద్యమందించినట్లు చిత్రీకరించారని వాపోయింది. వెంటనే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.