కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం కోడ్ అమల్లోకి రాగా జిల్లా పోలీసుశాఖ భారీబందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రధానంగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని రహదారులపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టింది. అక్రమంగా నగదు, మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. కోడ్ అమల్లోకి వచ్చిన మొదటి రోజే (ఆదివారం) రూ. 10 లక్షల దాకా పట్టుకొని సీజ్ చేసింది.
జిల్లా సరిహద్దులను ఆనుకొని ఉన్న మహారాష్ట్ర నుంచి ఎలాంటి అక్రమ రవాణా జరుగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల పోలీసులు, అధికారులతో పాటు మహారాష్ట్ర పోలీసులతో ఇటీవల నాగ్పూర్ ఐజీ చెర్రింగ్ డోర్జే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ మేరకు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. నగదు, మద్యం అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా అన్ని మార్గాల్లో నిఘా పెంచారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద, చింతలమానెపల్లి మండలం గూడెం, బెజ్జూర్ మండలం సోమిని, సిర్పూర్(టీ) మండలంలోని వెంకట్రావుపేట, కాగజ్నగర్ మండలం నందిగూడ, వాంకిడి సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి ఈ మార్గాలగుండా రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
సిర్పూర్(టీ) మండలం వెంకట్రావుపేట అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద కోడ్ అమల్లోకి వచ్చిన మొదటి రోజైన ఆదివారం రూ.5.26 లక్షలు పట్టుబడగా, కాగజ్నగర్ మండలం నందిగూడ చెక్ పోస్టు వద్ద రూ.4.87 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ. 50 వేలకు మించి తరలించే సమయంలో ఆ నగదుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తప్పని సరిగా తమవెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మద్యం, ఇతర విలువైన వస్తువులేవైనా రవాణా చేస్తున్న సమయంలో వాటిని ఎక్కడి నుంచి ఎక్కడి తరలిస్తున్నారు అనే ఆధారాలను తప్పక సూచించాల్సి ఉంటుందని, లేదంటే సీజ్ చేస్తామని చెబుతున్నారు.
జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంపై నిఘా ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో అల్లర్లు, సమస్యలను సృష్టించిన వారిపై నిఘా పెట్టనున్నారు. బైండోవర్ కేసులు నమోదు చేయనున్నారు. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఇక ఎన్నికలను పాదర్శకంగా నిర్వహించటంలో భాగంగా ఫ్లయింగ్, స్టాటిక్, వీడియో సర్వేయలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన సీ విలేజ్ యాప్ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోనున్నారు. ఓటర్లను మభ్య పెట్టేందుకు అక్రమంగా నగదు, మద్యం రవాణా కాకుండా చూడడంతోపాటు రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచారాలపై కూడా దృష్టిసారించనున్నారు.