దేశంలోని పలు ప్రాంతాల్లో ఒమిక్రాన్ బీఎఫ్ 7 కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు అప్రమత్తమంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
నిర్మల్ చైన్గేట్, డిసెంబర్ 29 : జిల్లాలో కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ముందస్తుగా మాక్ డ్రిల్ చేశారు. కొత్త వేరియంట్ ఏ క్షణమైనా జిల్లాలో ప్రవేశిస్తే కొవిడ్ను అరికట్టడంతో పాటు తగిన చికిత్స అందించేందుకు యుద్ధప్రాతి పదికన చర్యలు చేపడుతున్నారు. ఇందుకు గానూ ఐసోలేషన్ వార్డులు, ఆరోగ్య కేంద్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధం చేశారు. మందులను అందు బాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాం గం కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అర్హులందరూ టీకాలు తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఫస్ట్డోస్, సెకండ్ డోస్, ప్రికాషన్ డోస్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొవిడ్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేశారు. వైరస్ లక్షణాలున్న వారికి ఆర్ఏటీ, ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టారు. కొవిడ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 514891 నమూనాలు సేకరించారు. ఆర్ఏటి పరీక్షలు 4990 24 మందికి చేశారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు 15867 మందికి చేశారు. 22775 పాజిటివ్ కేసులు నమోద య్యాయి. ఇందులో 22712 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 63 మంది మృతి చెందారు. జిల్లాలో కొవిషీల్డ్, కొవాగ్జిన్, కార్బోవ్యాక్స్ మూడు రకాల వ్యాక్సిన్ ఇచ్చారు. కార్బోవ్యాక్స్ మొదటి డోస్ 2343 6 మంది రెండో డోస్ 23121 మంది తీసుకున్నారు.
మొదటి డోస్ 6,30,230
రెండో డోస్ 6,28,646
ప్రికాషన్ డోస్ 2,35, 834
చికిత్సకు సిద్ధ్దం చేసిన బెడ్లు
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 135 పడకలు
ప్రైవేటు దవాఖానల్లో 311 పడకలు
కోత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలి. భౌతిక దూరం పాటిస్తూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి. కొవిడ్ లక్షణాలు ఉన్న వారు పరీక్షలు చేయించు కోవాలి. కొవిడ్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లు ఏర్పాటు చేశాం. మందులు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో కొత్తగా కేసులు నమోదు కాలేదు.
– ధన్రాజ్, జిల్లా వైద్యాధికారి, నిర్మల్