ఈ విద్యాసంవత్సరం ఇంటర్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం విద్యార్థులకు ఎప్పటికప్పుడూ పరీక్షలు నిర్వహిస్తూనే, చదువుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
సారంగాపూర్, అక్టోబర్ 26 : నిర్మల్ జిల్లాను ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో మెరుగైన స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడూ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు కళాశాలల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఇంటర్ ఫలితాల్లో జిల్లా అత్యంత వెనుకబడింది. నిర్మల్ జిల్లాలో 26 ప్రభుత్వ కళాశాలలు ఉండగా, వాటిలో 5,097 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2019-2020 సంవత్సరంలో కొవిడ్ నేపథ్యంలో చదువులు సక్రమంగా సాగలేదు. విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు కొనసాగించినప్పటికీ అవి ఏ మాత్రం ఉపయోగపడలేదు. 2021లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించగా, నిర్మల్ జిల్లా ప్రథమ సంవత్సరంలో 61 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్రస్థాయిలో ప్రథమ సంవత్సరం 14వ స్థానం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 15వ స్థానంలో నిలిచింది. ఈ విద్యాసంవత్సరం విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డును ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎప్పటికప్పుడు రివిజన్ టెస్ట్లతోపాటు వారిని మూడు విభాగాలుగా విభజించి పర్యవేక్షించనున్నారు. మెరుగైన విద్యార్థులను గ్రూప్-ఏ, మధ్యస్త విద్యార్థులను గ్రూప్-బీ, ఆఖరు వారిని గ్రూప్-సీగా నిర్ణయిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై నిరంతరం దృష్టి సారించి వారిని గ్రూప్-ఏ విద్యార్థులతోపాటు చదివేలా అధ్యాపకులు కృషి చేయనున్నారు. ప్రతి వారం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, వారి సామర్థ్యాన్ని తెలుసుకోనున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చాలా మంది పేద విద్యార్థులే చదువుతుంటారు. ఇటు కళాశాలకు వెళ్తూనే ఇంటి పట్టున అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా సహాయ పడుతుంటారు. దీంతో చదువులపై దృష్టి సారించలేకపోతున్నారు. వార్షిక పరీక్షలకు హాజరైన తర్వాత ఫలితాలు చూస్తే నిరాశజనకంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్కు దీటుగా ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు.
ప్రత్యేక చర్యలు..
ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధించడంతో పాటు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారానికోసారి పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నుంచి ఆదేశాలు వచ్చాయి. విద్యార్థులను మూడు విభాగాలు(ఏ,బీ,సీ)గా విభజిస్తారు. సీ,బీ విద్యార్థులను కూడా ఏ లోకి వచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు భయం పోయి వార్షిక పరీక్షలు బాగా రాయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా మంచి ర్యాంక్లు సాధించడానికి వీలు ఉంటుంది.- జాదవ్ పశురాం, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, నిర్మల్.