హాజీపూర్, మార్చి 22 : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు వంద శాతం సాధించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మండల పంచాయతీ అధికారులతో పాటు గ్రామ కార్యదర్శులు పన్నులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 80 శాతం పన్నుల వసూలు చేయగా మిగతా 20 శాతం ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తమ ఆస్తి పన్నులను చెల్లించేందుకు కొందరు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండగా మరి కొందరి ఇంటికి వెళ్లి అడిగితే కానీ చెల్లించడం లేదు. జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నది.
ఇంటి పన్నులు, వాణిజ్య పన్నులు, మంచినీటి బిల్లుల వసూళ్లు వంద శాతం సాధించేలా అధికారులు ఒత్తిడి పెంచడంతో గ్రామాల్లో పన్నుల వసూళ్ల కోసం నిరంతరాయంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. జిల్లాలో 310 గ్రామ పంచాయతీల ద్వారా ఇంటి పన్నులు, ఇతర పన్నుల ద్వారా రూ. 8,10,61000 వసూలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రూ. 6 కోట్ల 50 లక్షలు వసూలయ్యాయి. మిగతా రూ. 1.50 కోట్ల పన్నులను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
వంద శాతం పన్నులు వసూలు చేసి జిల్లాను అగ్ర భాగాన నిలుపాలని ఉన్నతాధికారులు ఇచ్చిన సూచనల మేరకు జిల్లా అధికారులు పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు), ఎంపీడీవోలతో ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశాలను ఇచ్చారు. జిల్లాలోని 310 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు 80 శాతం వరకు వసూల్లు కాగా మార్చి నెలాఖరు 100 శాతం పూర్తి చేస్తామని పేర్కొంటున్నారు. ఇందుకోసం అంతా సమష్టిగా పని చేయాలని జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులకు పదేపదే సూచిస్తున్నారు. మండల పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో పన్నుల వసూళ్లు వేగవంతం చేశారు. మరింత దృష్టి సారిస్తే తప్ప లక్ష్యం చేరేలా కనిపించడం లేదు.
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నులను వంద శాతం వసూళ్లను చేరుకునేలా ఇప్పటికే 80 శాతం వసూల్లు చేశాం. మిగతా లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. వసూల్లు లక్ష్యాన్ని చేరుకోలేదో అక్కడ 100 శాతం పన్నులు వసూళ్లు చేసిన గ్రామ పంచాయతీల కార్యదర్శులను ఇంటింటికీ పంపించి పన్నుల వసూళ్లు చేయిస్తాం. పన్నుల బకాయి ఉన్నవారు సకాలంలో పన్నులను చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. పన్నుల వసూళ్లపై నిరంతరంగా పర్యవేక్షిస్తూ అప్రమత్తం చేస్తున్నాం. పన్నులు సకాలంలో చెల్లిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది.
– జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు