నిర్మల్ టౌన్, డిసెంబర్ 27 : ప్రయాణికుల సేవే ప్రథమ కర్తవ్యంగా భావించే టీఎస్ఆర్టీసీ అక్యుపెన్సీ పడిపోకుండా ఇప్పటికే అనేక రాయితీ పథకాలను అమలు చేసింది. దీంతో ప్రజల్లో ఆదరణ పొందుతున్నది. రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని సొంతూళ్లకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు అడ్వాన్స్ టిక్కెట్ రానూపోను బుకింగ్ చేసుకుంటే ధరలో పదిశాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి అధికారింగా ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో చాలా మంది సుదూర ప్రాంతాలైన నిజామాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో చదువుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు చెందిన కూలీలు, మేస్త్రీలు ఇక్కడ పని చేస్తున్నారు. వీరంతా తప్పనిసరిగా సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్కు పెద్దఎత్తున తరలివెళ్లనున్నారు. అక్కడ సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆనవాయితీగా ఏడాదంతా ఇక్కడ పని చేసిన వారంతా సొంతూళ్లకు వెళ్లి పండుగ ముగియగానే తిరిగొస్తారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ జనవరి 31 వరకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో పలువురికి ప్రయోజనం..
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సొంతూళ్లకు వెళ్లి తిరిగొచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రకటించిన పదిశాతం రాయితీ టికెట్ అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 602 ఆర్టీసీ సర్వీసులున్నాయి. ఇందులో డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో ప్రయాణం చేసేవారికి ఈ రాయితీ వర్తించనున్నది. సుమారు ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భైంసా, ముథోల్, ఉట్నూర్ డిపోల పరిధిలో ఉన్న లాంగ్రూట్ సర్వీసుల్లో ప్రయాణం చేసేవారికి ఇది ఉపయోగపడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లోని కందుకూర్, ఉదయగిరి, పామూ రు, వింజమూరు, ఒంగోలు, సీఎస్పురం, తెనాలి, గుంటూరు, ప్రకాశం తదితర ప్రాంతాలకు చెందిన వేలాది మంది మేస్త్రీ లు, కార్మికులు ఇక్కడ కూలీలుగా పని చేస్తున్నారు. వీరంతా పండుగ నేపథ్యంలో సొం తూళ్లకు వెళ్లారు. ప్రస్తుతం పండుగ సీజన్ నేపథ్యంలో వీరంతా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ ప్రాంతాలకు వెళ్లి రావాలంటే దూరభారాన్ని బట్టి రూ.670 నుంచి రూ.1500 వరకు టికెట్ ధర ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం పదిశాతం రాయితీ ప్రకటించడంతో చార్జీల్లో రానూపోను కలిపి సుమారు 150 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. కార్మికులంతా భవన నిర్మాణ గుత్తేదారుల వద్ద సామూహికంగా పని చేస్తుండడంతో వీరంతా కలిసే ఊళ్లకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో పండుగ కోసం వెళ్తున్న కూలీలకు యజమానులే బస్సు చార్జీలు చెల్లిస్తారు. ఆర్టీసీ ప్ర యాణం సురక్షితం కావడంతో యజమాను లు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లేందుకు ఆస క్తి చూపుతున్న నేపథ్యంలో సంక్రాంతి కాను క ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూర్చడంలో దోహదపడనున్నదని అధికారులు భావిస్తున్నారు. దీనికితోడు ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది విద్యార్థులు నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. వారికి సైతం సంక్రాంతి సెలవులు ప్రకటించనున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే పదిశాతం రాయితీ వర్తించనున్నది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాయితీని సద్వినియోగం చేసుకోండి..
ఆర్టీసీ ద్వారా సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ టిక్కెట్ ధరలో పదిశాతం రాయితీ పథకాన్ని అమలు చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిర్మల్ నుంచి ఉదయగిరి, కందుకూర్, పామూరు, వింజమూరు, రామచంద్రాపురం, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు అవసరమైన ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశాం. వీటిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
– సాయన్న, నిర్మల్ డిపో మేనేజర్