సోన్, డిసెంబర్ 9 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలతో కొండాపూర్ రూపు రేఖలు మారిపోయాయి. రాష్ట్ర సర్కారు కేటాయిస్తున్న నిధులతో అభివృద్ధి బాట పట్టి ఆదర్శంగా నిలుస్తున్నది. నిర్మల్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామంలో 1620 జనాభా ఉండగా, 1200 మంది ఓటర్లు ఉన్నారు. పల్లె ప్రగతి నిధులు రూ. 25 లక్షలతో పలు వీధుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలను నిర్మించారు. ఇంటింటికీ తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేసేలా అవగాహన కల్పించారు. రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా విధిస్తామని పంచాయతీ సిబ్బంది హెచ్చరించడంతో ప్రతి ఒక్కరూ ఆ నిబంధనను పాటిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ నిధులు రూ. 20 లక్షలతో ఇటీవల కొత్తగా గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. హరితహారంలో భాగంగా ఖాళీ ప్రదేశాలతో పాటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటికి కంచెలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ట్రాక్టర్ సాయంతో మొక్కలకు నీరు పోస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొండాపూర్ మీదుగా నిర్మల్- మంచిర్యాల రహదారికి ఇరువైపులా దాదాపు వెయ్యి మొక్కలను గ్రామ పంచాయతీ నిధులతో నాటి సంరక్షిస్తున్నారు. పల్లెప్రకృతి వనం ఆహ్లాదం పంచుతున్నది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో గ్రామంలోని నిరుపేదలకు డబుల్బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నారు.
వైకుంఠధామంతో తప్పిన తిప్పలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలో రూ. 12 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. దాతల సహకారంతో కూర్చోవడానికి సిమెంట్ కుర్జీలు ఏర్పాటు చేశారు. వైకుంఠధామానికి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. బట్టలు మార్చుకునేందుకు గదులను ఏర్పాటు చేశారు. ఇది వరకు వైకుంఠధామం లేక అంత్యక్రియలకు అనేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ బాధ తప్పిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి సహకారంతో వైకుంఠధామంలో మొక్కలు నాటగా, అవి ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
మా ఊరిని మస్తు అభివృద్ధి చేశారు
మా ఊరు పల్లె ప్రగతి నిధులతో మస్తు అభివృద్ధి చెందింది. ఇది వరకు ఎటు చూసినా మట్టి రోడ్లే కనిపించేవి. ఇప్పుడు సీసీ రోడ్లు వేశారు. రోడ్ల పక్కన మొక్కలు నాటి పెంచుతు న్నరు. ప్రతి రోజూ చెత్తా చెదారం శుభ్రం చేస్తున్నరు. ప్రధాన చౌరస్తాల్లో సిమెంట్ కుర్చీలలాంటివి ఏర్పాటు చేశారు. పొద్దున, సాయంత్రం పూట కాసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇది వరకు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు ఇబ్బందయ్యేది. ఇప్పుడు ఆ బాధ పోయింది. అన్ని సౌకర్యాలతో వైకుంఠధామం నిర్మించారు.
మంత్రి అల్లోల సహకారంతో..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో మా ఊరిని అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నాం. పల్లె ప్రగతి నిధులు మంజూరు చేయించడంతో మౌలిక వసతులు కల్పించగలిగాం. సీసీ రోడ్లు, మురుగు కాలువలు, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించాం. పల్లె ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దాం. హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. మున్ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మా ఊరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.