కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇటీవల గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టులు మృతి చెందగా, పోలీసుశాఖ అప్రమత్తమైంది. జిల్లా సరిహద్దులతో పాటు చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన ని ఘా పెట్టింది. కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో పాటు ఎస్పీ సురేశ్కుమార్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ తనిఖీలు చేపడుతున్నారు. మద్యంతో పాటు నగదును స్వాధీ నం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 87,887 రూపాయల విలువగల 173 లీటర్ల మ ద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఎలాంటి ఆధారా లు లేకుండా తరలిస్తున్న రూ. 23 లక్షల 89 వేల 990, 17 ఎల్జీ మిక్సర్లు, 43 కూలర్లను పట్టుకున్నారు. వీటి విలువల సుమారు రూ.1.75 లక్షల వరకు ఉంటుంది. 1.05 కేజీల గంజాయిని కూడా పట్టుకున్నారు. 31 మందిని బైండోవర్ చేశారు. మారుమూల గ్రామాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ అపరిచితు లు, కొత్తవారి మాటలు నమ్మవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదం గా కనిపిస్తే పోలీస్ కంట్రోల్ రూం నంబర్. 08733 279033కు సమాచారమివ్వాలని సూచిస్తున్నారు.
ఇటీవలగడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో మంగి- ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి డీవీసీఎం వర్గీష్, సిర్పూర్- చెన్నూర్ ఏరియా కమిటీ కార్యదర్శి డీవీసీఎం మగ్తు చనిపోవడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎన్నికల భద్రత కోసం వచ్చిన పోలీసు గ్రేహౌండ్స్ దళాలను అప్రమత్తం చేయడంతో పాటు జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో గట్టి నిఘా పెంచారు. ప్రాణహిత సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండడంతో నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ పొరుగునే ఉన్న గడ్చిరోలిలో ఎన్కౌంటర్ జరగడం, ఈ ఘటనలో చనిపోయిన మావోయిస్టులు వర్గీస్, మగ్తు ఉమ్మడి జిల్లాతో సంబంధం ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రాణహితను సరిహద్దుల వెంబడి ఉన్న అడవుల్లో కూంబింగ్ పెంచారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా పోలీసుల నిఘా నీడలో జరుగనున్నాయి.