ఇంద్రవెల్లి, జనవరి 25 ః కొలాం గిరిజనులు తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా చేయాలని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. గురువారం మండలంలోని సమక పంచాయతీ పరిధిలోని పాటగూడలో ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీకి గిరిజన మహిళలు తిలకం దిద్ది పువ్వులు చల్లుతూ, గుస్సాడీ నృత్యాల మధ్య స్వాగతం పలికారు. అనంతరం గుస్సాడీలతోపాటు గ్రామస్తుల ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. అనంతరం ఎస్పీ చేతుల మీదు గా 300ల మంది కొలాం గిరిజనులకు దుప్పట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. నేను గతంలో కూడా ఆదివాసీ జిల్లాలోనే విధులు నిర్వహించానని, మళ్లీ ఆదివాసుల జిల్లాలో విధులు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కొలాంలు అన్ని రంగాల్లో రాణించి అభివృద్ధి చెందాలన్నారు. వీరి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పీఎం జనజాతి పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 18 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కొలాంల కోసం ప్రత్యేక జాబ్మేళా నిర్వహించాలని ఎంపీటీసీ భీంరావ్ కోరారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, సీఐ రామకృష్ణ, స్పెషల్ పోలీస్ రామారావ్, పటేల్ కొడప లక్ష్మణ్, కారోబారి రాజేశ్వర్ పాల్గొన్నారు.