జల్.. జంగల్.. జమీన్ కోసం పోరాడిన వీరుడి త్యాగాలను యావత్ ప్రజానీకం స్మరించుకున్నది. శనివారం కెరమెరి మండలం జోడేఘాట్లో కుమ్రం భీం, కుమ్రం సూరు వర్ధంతిని అధికారికంగా నిర్వహించగా, ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనసందోహంతో పోరుగడ్డ పులకించింది. డప్పు చప్పుళ్లు, సన్నాయి, కాలీకోం వాయిద్యాలు.. ఆటా పాటలతో ఆ ప్రాంతం మారుమోగింది. భీం మనువడు సోనేరావ్, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని చాహత్ బాజ్పాయి, ఎస్పీ సురేశ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ దీపక్ తివారి భీం విగ్రహం, సమాధివద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ఆదివాసుల అభ్యున్నతికి చేసిన కృషిని వివరించారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ కెరమెరి, అక్టోబర్ 28
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ కెరమెరి, అక్టోబర్ 28 : ఆదివాసుల ఆరాధ్యదైవం కుమ్రం భీం 83వ వర్ధంతిని జోడేఘాట్లో శనివారం అధికారికంగా నిర్వహించారు. తెలంగాణ నుంచేగాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి అడవిబిడ్డలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరాగా, పోరుగడ్డ పరవశించింది. డప్పు, సన్నాయి, కాలీకోం వాయిద్యాలు, గుస్సాడీ నృత్యాలు, కోలాటాలతో ఆ ప్రాంతం మారుమోగింది. కుమ్రం భీం వారసులు, వంశీయులు సంస్కృతీ సంప్రదాయల నడుమ పూజా కార్యక్రమం నిర్వహించి అమరవీరుల జెండాలను ఎగురవేశారు. అనంతరం భీం విగ్రహం, సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భీం వర్ధంతికి ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. భీం మనువడు కుమ్రం సోనేరావ్, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్పాయి, ఎస్పీ సురేశ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై కుమ్రం భీం, ఆయన అనుచరుడు కుమ్రం సూరుకు ఘనంగా నివాళులర్పించారు.
కుమ్రం సూరు వర్ధంతిని జోడేఘాట్లో అధికారికంగా నిర్వహించారు. సూరు మనువడు కుమ్రం పాండు ఆధ్వర్యంలో కొలాం ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి నివాళులర్పించారు.
9 తెగల ఆదివాసులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గోండి, తెలుగు భాషలో కళాకారులు పాడిన పాటలు, ఆదివాసీ కళాకారులు చేసిన గుస్సాడీ, థింసా నృత్యాలు కనువిందు చేశాయి.
ప్రభుత్వం హట్టి నుంచి జోడేఘాట్ వరకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది. వర్ధంతికి వచ్చిన మహిళలు, పురుషులు, వీఐపీలు, పోలీసులు, మీడియాకు వేర్వేరుగా తాగునీరు, భోజన సౌకర్యం కల్పించారు.
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరంతో పాటు మొబైల్ దవాఖాన ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా ఏటా నిర్వహించే గిరిజన దర్బార్ రద్దు అయింది. అధికారులు ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించి అర్జీలను స్వీకరించారు.
భీం వర్ధంతి సందర్భంగా జోడేఘాట్ జాతరను తలపించింది. పెద్ద సంఖ్యలో దుకాణాలు, హోటళ్లు ఏర్పాటు చేశారు. రూ. 25 కోట్లతో నిర్మించిన భీం స్మృతి చిహ్నం, కాంస్య విగ్రహంతో పాటు మ్యూజియంలో ఏర్పాటు చేసిన చిత్రాలు, కళాఖండాలను చూడడానికి జనం ఎగబడ్డారు.
భీం సంస్మరణ సభ సందర్భంగా తరలివచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్పీ కే.సురేశ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హట్టి నుంచి జోడేఘాట్ వరకు రహదారి పొడువునా తనిఖీలు చేశారు. పహారా కాశారు.
భీం వర్ధంతిలో అదనపు ఎస్పీ అచ్చేశ్వరరావు, డీఎస్పీ వెంకటరమణ, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, సీఐలు, ఎస్ఐలు, డీఎంహెచ్వో తుకారాం భట్, ఆయా శాఖల అధికారులు, ఎంపీపీ పెందోర్ మోతీరాం, జడ్పీటీసీలు సెడ్మాకి దుర్పతాబాయి, కోవ అరుణ, అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీడీవో మహేందర్, తహసీల్దార్ జమీర్తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
– కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు
కుమ్రం భీం పోరాటం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. భీం వర్ధంతి సందర్భంగా జోడేఘాట్లో ఏర్పాటు చేసిన వేడుకల కు హాజరయ్యారు. భీం వారసులు, మనువడు కుమ్రం సోనేరావు దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసుల హకుల కోసం, వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన ధీరుడు కుమ్రం భీం అని కొనియాడారు. ప్రభుత్వం గిరిజనులు, ఆదివాసుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. పోడు సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజన రైతులకు పట్టాలు అందించిందని చెప్పారు.
ఆదివాసుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారు. 2014లో ఆయన దర్బారుకు హాజరయ్యా రు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. రూ. 25 కోట్ల తో జోడేఘాట్ను అభివృద్ధి చేశారు. ఆదివాసుల సంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా మ్యూజియం ఏర్పాటు చేశారు. జోడేఘాట్కు రోడ్డు వసతి కల్పించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు. ఆదివాసీలు తరతరాలుగా ఎదుర్కొంటున్న పోడు భూ సమస్యలకు పరిష్కారం చూపించారు. పోడు భూములకు పట్టాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. మున్ముందు ఆదివాసులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. కుమ్రం భీం ఆశయాలను నెరవేరుస్తాం.
– కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్
నాడు జోడేఘాట్ను పట్టించుకున్నోళ్లు లేకుండే. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దా రు. ప్రధానంగా రెండు వరసల రహదారి నిర్మించ డంతో మెరుగైన రవాణా సౌకర్యం కలిగింది. ఆది వాసీ గ్రామాలను కూడా ఎంతో అభివృద్ధి చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగు నీరందించా రు. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇచ్చారు. విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు. ముఖ్యంగా పోడు పట్టాలు అందించి దశాబ్దాల కల నెరవేర్చా రు. అడవిబిడ్డల ఆశయ సాధనకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయం.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
తెలంగాణ ఏర్పడిన తర్వాత జోడేఘాట్ను సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు. ఆదివాసులకు పోడు పట్టాలు అందించి శాశ్వత పరిష్కారం చూపారు. భీంకు వారసులమైన మేము కేసీఆర్ వల్లే బాగుపడ్డాము. మా కుటుంబంలో ఒకరికి టీచర్ ఉద్యోగం, మరొకరికి సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. మాకు ఐదు ఎకరాల భూమి కూడా ఇచ్చారు. ఆయనకు మేమంతా రుణపడి ఉంటాం. కేసీఆర్తోనే ఆదివాసీలకు న్యాయం జరిగింది.
– కుమ్రం సోనేరావ్, కుమ్రం భీం మనుమడు