ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో, తీవ్రత పెరుగుతున్నది. ఇప్పటికే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ దిగువకు నమోదవుతుండగా, సూర్యోదయమైనా పొగమంచు వీడడం లేదు. శివారు ప్రాంతాలు,వ్యవసాయ తోటలను మంచు దుప్పటి కమ్మేస్తోంది. కాగా, ప్రకృతి ఒడిలో దాగిన గిరి గ్రామాల్లో తొలిపొద్దు వేళలో ‘నమస్తే బృందం’ పర్యటించింది. పల్లెల్లో సుందర దృశ్యాలను ఒడిసి పట్టింది. ఇంటి ముందు ముగ్గు వేసే మహిళ నుంచి బతుకుబాటలో బయల్దేరిన అడవి బిడ్డల చిత్రాలను కెమెరాలో బంధించింది. పల్లె ఒడిలో అవిష్కృతమైన చిత్రమాలికను మీ ముందుంచుతున్నది.
తాగునీరే..: ఉదయాన్నే నీరు తీసుకొస్తున్న మహిళ
ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్/నార్నూర్/ బెజ్జూర్/ఇంద్రవెల్లి, నవంబర్ 13 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న కారణంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు అంతకంతకూ తగ్గుతున్నాయి. ప్రస్తుతం 12 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువలో కొనసాగుతున్నాయి. పల్లెల్లో ఉదయం 9 గంటలైనా పొగమంచు తొలగిపోవడం లేదు. ఉదయం పూట పనులు చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
ఈ నేపథ్యంలో సూర్యోదయానికి ముందే ‘నమస్తే బృందం’ పలు గ్రామాల్లో పర్యటించింది. ఇంటి పనులతో పాటు బతుకు బాటలో రోడ్డెక్కిన వారి ఫొటోలను కెమెరాలో బంధించింది. చలికి తాళలేక చలిమంటలతో సేదదీరుతున్న వారు, పొలం బాట, బడి బాట, ఇలా ప్రతి ఒక్క అందమైన దృశ్యాన్ని ఒడిసి పట్టింది.
క్లీన్ అండ్ గ్రీన్ : రాంనగర్ వద్ద ఉదయాన్నే రోడ్డు ఊడుస్తున్న పారిశుధ్య కార్మికులు