ఇంద్రవెల్లి, సెప్టెంబర్11: ఇంద్రవెల్లి మండలంలోని సమక గ్రామ పంచాయతీ పరిధి పాటగూడ(మారుతిగూడ)లో పాముకాటుతో అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని ధనోరా గ్రామపంచాయతీ పరిధి అక్షపూర్ కొలాంగూడకు చెందిన ఆత్రం రాజు-కవిత దంపతులకు ఏడుగురు సంతానం. దంపతులిద్దరి మధ్య ఇటీవల గొడవలు జరగడంతో పిల్లలతో కలిసి కవిత తన పుట్టింటి(పాటగూడకు)కి వచ్చింది. అక్కడే ఒక గుడిసే వేసుకొని కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తున్నది. శనివారం రాత్రి పిల్లలతో కలిసి కవిత ఇంట్లో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రెండోవాడైన ఆత్రం భీంరావ్(14) తన చెవిపై పాము కాటేసిందని గుర్తించి, కేకలు వేశాడు. వెంటనే తేరుకున్న కవిత స్థానికులను పిలిచింది. వారు వచ్చి, భీంరావ్ను దవాఖానకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ అదే పాము అంతకుముందే ఆరో సంతానమైన దీప(4)ను కూడా కాటేసింది. ఆలస్యంగా గుర్తించడంతో అప్పటికే దీప అపస్మారకస్థితిలోకి వెళ్లి, ఇంటి వద్దే మృతి చెందింది. భీంరావ్ను దవాఖానకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లు మృతి చెందడంతో గ్రామం లో విషాద చాయలు అలుముకున్నాయి.