కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/సిర్పూర్ (టీ) , ఫిబ్రవరి 26 : వారం క్రితం సిర్పూర్(టీ) మండ లం వేంపల్లిలోని లక్ష్మీ నరసింహా రైస్ మిల్లులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ. 3 కోట్ల విలువగల 36 వేల బస్తాల ధాన్యం కనబడకుండా పోగా, తాజాగా.. సోమవారం శ్రీ సాయి బాలాజీ ఆగ్రోటెక్ రైస్మిల్లులో చేసిన తనిఖీల్లో రూ. 5.90 కోట్ల విలువైన 69,394 బస్తాల ధాన్యం మాయమవ్వడం విమర్శలకు తావిస్తున్నది. గతేడాది రబీ సీజన్కు సంబంధించిన వడ్లు.. ప్రస్తుతం సీఎంఆర్ గడువు సమీపిస్తున్న సమయంలో కనబడకుండా పోవడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది. అధికారులకు తెలిసే.. మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారనడానికి ఈ ఘటనలే నిదర్శనమని పలువురు ఆరోపిస్తున్నారు.
సోమవారం నిర్వహించిన తనిఖీల్లో కళ్లు చెదిరే వాస్తవాలను అధికారులు గుర్తించారు. గత రబీ సీజన్(2022-23)కు సంబంధించి 37,025 బస్తాలు ఉండాల్సింది. కానీ మిల్లులో కేవలం 9,639 బస్తాలే ఉన్నాయి. 27,386 బస్తాలు కనిపించడం లేదు. ఇక 2023-24కు సంబంధించి 42,130 బస్తాలు ఉండాలి. కానీ.. కేవలం 122 బస్తాలే ఉన్నాయి. మొత్తం 69,394 ధాన్యం బస్తాలు తక్కువగా వచ్చాయి. వీటి విలువ మొత్తం రూ. 5 కోట్ల 90 లక్షలుగా అధికారులు గుర్తించారు. ఈ రిపోర్టును అదనపు కలెక్టర్కు పంపించి కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
రబీ సీజన్ (2022-23)కు సంబంధించి 1,62,110 క్వింటాళ్ల బియ్యాన్ని జిల్లాలోని 20 మిల్లులు ఎఫ్సీఐకి అప్పగించాలి. సీఎంఆర్ ఇచ్చే గడువు గత నెలలోనే ముగిసినప్పటికీ, ప్రభుత్వం ఈ నెల 29 వరకు గడువు పొడిగించింది. ఇప్పటి వరకు రైస్ మిల్లర్లనుంచి కేవలం 8,120 క్వింటాళ్ల బియ్యం మాత్రమే ఎఫ్సీఐకి అందాయి. మిగతా 1,53,990 క్వింటాళ్ల బియ్యం సరఫరా కావాల్సి ఉంది. కానీ.. సీఎంఆర్ ఇచ్చే విషయంలో మిల్లర్ల తీరు విమర్శలకు తావిస్తున్నది.
జిల్లాలోని సిర్పూర్-టీ వేంపల్లిలోని రెండు రైస్ మిల్లుల్లోనే దాదాపు 1,05,394 వేల ధాన్యం బస్తాలు కనపడకుండా పోయిన విషయం చర్చనీయాంశంగా మారిం ది. వీటి విలువ రూ. 8 కోట్ల 90 లక్షల వరకు ఉంటుం ది. కేవలం రెండు మిల్లులోనే ఈ స్థాయిలో ధాన్యం గోల్మాల్ జరిగితే.. మొత్తం 20 రైస్ మిల్లులో పరిస్థితి ఎలా ఉందో తనిఖీలు చేస్తే బయటపడుతుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతులు పండించిన ధాన్యా న్ని లేవీకి ఇస్తున్నారు. దీనికి జిల్లాలోని రైస్మిల్లులకు రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లయ్ అధికారులు ఇస్తున్నారు.
అధికారులు, రైస్ మిల్లర్లతో లోపాయికారి ఒ ప్పందాలతోనే ఇలాంటి అవినీతికి ఆస్కారం కలుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు ఎప్పటికప్పుడు మిల్లులను పర్యవేక్షించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ధాన్యం బస్తా ల మిస్సింగ్ విషయం రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియడంతో.. జిల్లా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారు లు హడావుడిగా తనిఖీలు చేపడుతున్నారు. దీనినిబట్టి వీరి వ్యవహారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ మొత్తంలో వడ్లు మాయం కాగా, సరైన విచారణ చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి.. వ్యా పారులకు అమ్ముకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.