ఒకవైపు పదునైన మాటలు.. మరోవైపు కేంద్రంపై నిప్పులు.. ఇంకోవైపు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి.. వీటిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు.. ప్రజలను జాగృతం చేసేందుకు విజ్ఞప్తులు.. ఇన్ని కలబోతల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. పెదపల్లి బహిరంగ సభావేదికగా.. ఆయన మరోసారి కేంద్ర బీజేపీ ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్రమోదీపై నిప్పులు కురిపించారు. అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణను.. విచ్ఛిన్నం చేసేందుకు మతం, కులం పేరిట బీజేపీ ఆడుతున్న డ్రామాలను ప్రజలకు విప్పి చెప్పారు. పనిలో పనిగా.. చెప్పులు మోసే గులాంలు కారుకూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంకోవైపు.. మోటర్లకు మీటర్లు రాకుండా ఉండాలన్నా.. దేశ ప్రతిష్ట పెరగాలన్నా. కులమతాల చిచ్చు అనే మంటలు రేగకుండా ఉండాలంటే బీజేపీ ముక్త్ భారత్కు సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేస్తున్న తీరుపై ఉక్కు పిడికిలిబిగించాని విజప్తి చేశారు. సభ గ్రాండ్ సక్సెస్తో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
కరీంనగర్ ప్రతినిధి/పెద్దపల్లి, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ) : ‘తలాపున పారు తుంది గోదావరి.. నా చేనూ చెలుక ఎడా రి..’ అని పాట రాసిన గడ్డ ఈ పెద్దపల్లి. మూర్మూరు గ్రామానికి చెందిన కవి సదా శివ ఈ పాట రాశారు. ఉద్యమ సమయం లో చైతన్యం నింపిన ఈ గడ్డ.. అదే చైత న్యంతో సింగరేణి కార్మికలోకం కన్నెర్రచేసి పిడికిలి ఎత్తాలి”అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో సోమవారం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సిం గరేణి కార్మికుల విషయంలో తీసుకుంటున్న చర్యల వల్ల జరు గుతున్న మేలు కార్మికుల ముందు ఉందని చెప్పిన ముఖ్యమంత్రి.. సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నదని, అందుకే పిడికిలి ఎత్తాలని పిలుపునిస్తున్నట్లు వివరించి చెప్పారు. మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే.. విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నది. అటువంటి బీజేపీని అందరం కలిసి ప్రతిజ్ఞ పూని.. 2024లో బీజేపీ ముక్త్ భారత్ బీజేపీ లేని భారతదేశాన్ని సృష్టించడానికి సన్నద్ధం కావాలి” అని పిలుపునిచ్చారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లండి.. మేము మీ వెంట ఉంటాం..
16 నిముషాలపాటు చేసిన ప్రసంగంలో అన్ని విషయాలను ప్రజలకు విప్పిచెప్పారు. తాజాగా, 26 రాష్ర్టాల నుంచి వచ్చిన రైతు నాయకులు.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై చెప్పిన అభిప్రాయాలను ప్రజల ముందు పెట్టారు. ఇదే సమయంలో.. “రైతు నాయకులు జాతీయ రాజకీయాల్లోకి రమ్మంటున్నారు.. మరి మనం పోదామా.. జాతీయ రాజకీయాల్లోకి” అంటూ ప్రశ్నించినప్పడు సభ యావత్తు ఒక్కతాటిపైకి వచ్చి వివిధ రూపాల్లో కేసీఆర్కు మద్దతును ప్రకటించింది. మీరు వెళ్లండి మేముంటామన్న సంకేతాన్ని ఇచ్చింది. “దేశాన్ని దోచుకుంటున్న కేంద్ర బీజేపీ నాయకులు ఇక్కడున్న బీజేపీ నాయకులను గులాంలను చేసుకొని.. బూట్లు మోపించి. చెప్పులు మోపిస్తుండ్రు. చెప్పులు మోసిన వెదవలు కూడా ఎటువడితె అటు కారుకూతలు కూస్తూ సమాజాన్ని కలుషితం చేసేపని చేస్తుండ్రు. ఇటువంటి దొంగలకు ప్రజలే సరైన బుద్ది చెప్పాలి” అంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన సమయంలో.. సభ నుంచి జై కేసీఆర్ అంటూ నినదించారు. “ప్రధాని రాష్ట్రంలో 24 గంటల కరెంటు రాదు.. 2000ల పెన్షన్ రాదు. పేదలకు ఆరోగ్యశ్రీ వంటి పథకం లేదు. ఏమీ లేదు దోపిడీ తప్ప.. అక్కడి నుంచి వచ్చే గులాంగాళ్లు.. ఈ దేశాన్ని దోచే దోపిడీ దొంగలు.. ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు మనకు కనపడుతున్నారు తెలంగాణలో.. 60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అత్మగౌరవంతో ఉండాలా? లేక మళ్లీ ఢిల్లీ నుంచి వచ్చే ఏజెంట్లకు.. గజదొంగలకు సద్దిగట్టి గులాంలం అవుదామా.. దయచేసి ఆలోచన చేయండి..” అంటూ విజ్ఞప్తి చేసినప్పుడు.. అత్మగౌరవం కాపాడుకుందామంటూ ప్రజలనుంచి నినాదాలు వచ్చాయి. “మోసపోతే గోసపడుతం.. ఒక్కసారి దెబ్బతింటే చాలా వెనక్కిపోతం.. మీ బిడ్డగా నేను ఒక్కటే చెపుతున్న.. బాగుపడే సమ యంలో.. ఈ దుర్మార్గులు, లంచ గొండులు వచ్చి లక్షల కోట్ల ఖజా నాను దోచుకునే దొంగలు వచ్చి.. మతం పేరు మీద కొట్లాడుండ్రి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పారేటి స్వచ్ఛమైన నీళ్లు కావాలా.. మత కలహాలు మంటలు చెలరేగే నెత్తురు పారాలా..” అంటూ చేసిన ప్రసంగం ప్రజలను ఆలోచించేలా చేసింది.
ప్రధానంగా రైతులకు ఉచిత కరెంటు కేంద్రం పెడుతున్న కొర్రీల విషయంలో అంకెలతో సహా ప్రజల ముందు పెట్టారు. దేశం మొత్తంలో వ్యవసాయానికి వాడుతున్న కరెంటు 20.8 శాతం మాత్రమేనని, దీనికి అయ్యే వ్యయం కేవలం రూ.1.45 లక్షల కోట్లు మాత్రమేనని, ఇది ఒక కార్పొరేట్ కంపెనీకి దోచిపెట్టినంత కాదని రైతులకు అర్థం ఆయ్యేలా వివరించి చెప్పారు. ‘మీటర్లు పెట్టాలంటూ వెంటపడుతున్న నరేం ద్ర మోదీకి మనమంతా కలిసి మీటర్ పెట్టాలి’ అంటూ ముఖ్య మంత్రి చెప్పినప్పుడు.. సభలో చప్పట్లు మారుమోగాయి. కుట్రలు, కుతంత్రాలే కాదు.. కుల మతాల పేరుతో చిచ్చుపెడుతున్న బీజేపీ తీరుపై గ్రామాల్లో చర్చపెట్టాలని పిలుపునిచ్చారు. మేథావులు, బుద్ధిజీవులు, యువకులు మేల్కొని ప్రతి గ్రామంలో చర్చ పెట్టి ప్రజలను చైతన్య వంతులను చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ మత పిచ్చిగాళ్లు, ఉన్నాదుల నుంచి దేశాన్ని కాపాడేందుకు ముందుకు వెళ్లాలని సూచించారు. మౌనం శాపం అవుతుందని సూచించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.