శ్రీరాంపూర్, ఏప్రిల్ 24 : సింగరేణిలో మరోసారి కార్మిక వర్గం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నామని, రాజకీయ పంథాలో కాకుండా కార్మిక సంఘంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 24న గోదావరిఖని ప్రెస్క్లబ్లో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే టీబీజీకేఎస్ కేంద్ర జనరల్ బాడీ సమావేశం వాల్ పోస్టర్ను రాజిరెడ్డి విడుదల చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే సింగరేణి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్ పోరాడుతుందన్నారు. బీఆర్ఎస్ సహాయ, సహకారాలతో స్నేహపూర్వకంగా ఉంటామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడాన్ని విరమించు కోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకే కేంద్ర ప్రభుత్వం గనులు కేటాయించాలన్నారు.
గతంలో గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడామని, సమ్మెలు చేశామన్నారు. యాజమాన్యం కూడా గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ, సింగరేణికి గనులు కేటాయించాలని నిర్ణయించిందన్నారు. కార్మికులకు ఐటీ మినహాయించాలని, యాజమాన్యం తిరిగి చెల్లించాలన్నారు. కార్మికులందరికీ డిజిటల్ మెడికల్ కార్డులు అందించాలని, దాని ఆధారంగానే కార్మికుడు కోరుకున్న కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రూ.37 వేల కోట్ల టర్నోవర్ సాధించిందని చెప్పారు. లాభాలు తెచ్చిన ఉద్యోగులందరికీ ఒక జ్ఞాపికగా బంగారు నాణెం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొమురయ్య, రవి, పెట్టం లక్షణ్, పానగంటి సత్తయ్య, గొర్ల సంతోష్, తొంగల రమేశ్, సాదుల భాస్కర్, అన్వేష్రెడ్డి, ఏరియా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఉత్తేజ్రెడ్డి, నరేశ్, పొగాకు రమేశ్, సత్తన్న, మారం శ్రీనివాస్, రాజునాయక్ పాల్గొన్నారు.