శ్రీరాంపూర్, జనవరి 5 : సింగరేణి సంస్థ నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఅండ్ఎండీ) ఎన్ బలరాం పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జీఎంలు, డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణిని దేశంలోనే అగ్రస్థాయి కంపెనీగా నిలిపేందుకు ప్రతి ఉద్యోగీ తమవంతు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పారు. దేశ ఇంధన అవసరాలకనుగుణంగా, రానున్న వేసవి నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాలని, ఇందుకోసం ప్రతి రోజూ 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని కోరారు.
రోజుకు 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాలని ఆదేశించారు. ఆడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్టు సహా కంటీన్యూయస్ మైనర్లు, సీహెచ్పీలపై సమీక్షించారు. ఉత్పత్తి, ఉత్పాదకతపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మొదటి 9 నెలల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు అశాజనకంగా ఉన్నాయన్నారు. బొగ్గు ఉత్పత్తి 5.15 శాతం వృద్ధితో 49.66 మిలియన్ టన్నులు, రవాణాలో 8 శాతం వృద్ధితో 51 మిలియన్ టన్నులు, ఓవర్ బర్డెన్ తొలగింపులో 6 శాతం వృద్ధితో 306.6 మిలియన్ క్యూబిక్ మీటర్ల మేర లక్ష్యాలను సాధించినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న 3 నెలల్లోనూ సమష్టిగా లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నూతన ప్రాజెక్టులను ప్రారంభించడంలో ఎదురవుతున్న అవాంతరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భూసేకరణ, ఇతర అనుమతులపై ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. ఒడిశాలోని నైనీ బ్లాక్లో సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడుతామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్పారని తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు సత్యనారాయణ, ఎన్వీకే శ్రీనివాస్, వెంకటేశ్వర్రెడ్డి, ఈడీ జే అల్విన్, జీఎం సురేశ్, జక్కం రమేశ్, సుబ్బారావు, దేవేందర్, సూర్యనారాయణ, శ్రీరాంపూర్ నుంచి జీఎం సంజీవరెడ్డి, రీజియన్ సేఫ్టీ జీఎం కే హరినారాయణగుప్తా, ఎస్వోటు జీఎం రఘుకుమార్, ఏజీఎం మురళీధర్, డీవైజీఎం అరవిందరావు, చిరంజీవులు, రాముడు, సర్వే ఆఫీసర్ వెంకటేశం, క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.