మంచిర్యాల, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీ కృష్ణుడు దేవకీ వసుదేవులకు శ్రావణ మాసం కృష్ణ పక్షం, అష్టమి తిథిన చెరసాలలో జన్మించాడు.
చాంద్రమానం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి.. ఇదే రోజు రోహిణీ నక్షత్రం కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. ఈ ఏడాది శనివారం శ్రీ కృష్ణాష్టమిని జిల్లాలో ఘనంగా జరుపుకొనేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలల్లో గోకులాష్టమి వేడుకలు ముందస్తుగా శుక్రవారం నిర్వహించనున్నారు.
పండుగ విధానం..
కృష్ణాష్టమి రోజున భక్తులు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పండ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడను నైవేద్యంగా సమర్పిస్తారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పడుకోబెట్టి రకరకాల పాటలు, కీర్తనలు ఆలపిస్తారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి వాటిని కొట్టేందుకు పోటీపడుతారు. అందుకే ఈ పండుగను ‘ఉట్ల పండుగ’, ‘ఉట్ల తిరునాళ్లు’ అని కూడా పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీ కృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతున్నది. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో శ్రీ కృష్ణుడు మానవాళికి దిశానిర్దేశం చేశాడు. ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు నేటి కలియుగానికీ ఆదర్శ మూర్తిగా నిలుస్తున్నాడు. అందుకే ఆయనను అందరూ ఇష్టదైవంగా కొలుస్తున్నారు.
నేడు పాఠశాలల్లో ముందస్తు వేడుకలు..
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం పాఠశాలలకు సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలికలకు గోపికలు, బాలురకు శ్రీ కృష్ణుడి వేషధారణలతో పండుగలా నిర్వహించనున్నారు. ఉట్టిని కొట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.