కెరమెరి, ఏప్రిల్ 17 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని శివగూడ. 13 కుటుంబాలు ఉండగా.. 50 మందికిపైగా జనాభా ఉంటారు. జోడేఘాట్ పోరాటంలోని 12 గ్రామాల్లో ఇది ఒకటి. మండల కేంద్రం నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ గ్రామస్తులకు ఎండాకాలం వచ్చిందంటే గొంతు తడుపుకోవడానికి కూడా చుక్కా నీరు దొరకకపోయేది. సమైక్య పాలకుల పట్టింపులేని తనంతో నీటికి అవస్థలు పడేవారు. గూడెంలోని కొలాం గిరిజనులు రెండు గుట్టలు దిగి లోయలో ఉన్న ఆసిఫాబాద్ మండలంలోని గోగిన్ మోవడ్ వాగును ఆశ్రయించేవారు.
బిందెడు నీటి కోసం చిన్నాపెద్దా అనే తేడాలేకుండా సుమారు రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకునే వారు. నడవడానికి సైతం సరైన మార్గం లేనప్పటికీ, గత్యంతరం లేక రాళ్లు రప్పల మధ్య బిందెలు మోస్తూ నీటిని తెచ్చుకునే వారు. ఎత్తయిన గుట్టల పక్కన పెద్దలోయ ఏ మాత్రం అదుపు తప్పినా ప్రాణానికే ప్రమాదం. అయినా సాహసోపేతంగా వెళ్తూ స్నానాలు చేసి, బట్టలు అక్కడే శుభ్రం చేసుకొని బిందెలతో నీటిని తెచ్చుకునే వారు. మధ్య మధ్యలో కొద్ది సేపు సేదతీరి ఇంటికచ్చే వారు. దశాబ్దాలుగా కష్టాల మధ్య జీవిస్తున్న వారికి తెలంగాణ సర్కారు భగీరథ నీళ్ల అందించింది. ఇంటింటికీ నల్లా బిగించి నీరు అందిస్తున్నది. మూడేండ్ల నుంచి శుద్ధజలం తాగుతూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ప్రజలతోపాటు జీవరాసులు కూడా మిషన్ భగీరథ నీటిని తాగుతున్నాయి.
గుమ్మంలోనే నల్లా నీళ్లు
కేసీఆర్ సార్ వల్లే మాకు నీటి సమస్య దూరమైంది. ఇంటి గుమ్మంలోనే నల్లా పెట్టారు. గతంలో మా కష్టాలను ఏ సర్కారు పట్టించుకోలేదు. తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎన్నో సార్లు నాయకులకు చెప్పినా ఎవ్వరూ పట్టించుకో లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత కాలం ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేశా రు. అనంతరం మిషన్ భగీరథ పథకం వచ్చా క గ్రామానికి పైపులైన్ వేసి నల్లాలు బిగించా రు. కేసీఆర్ సార్ చేసిన మేలు ఎప్పటికీ మరువం. – మారుబాయి, శివగూడ(కెరమెరి)తలుచుకుంటేనే దుఃఖమస్తది..
ఆ నాటి నీళ్ల బాధలు తలుచుకుంటే దుఃఖమస్తది. ఎండల్లో బోర్ పని చేయకుంటే చెలిమే నీళ్లు తెచ్చుకొని తాగినం. అది కూడా అందుబాటులో దొరికేది కాదు. 2,3 కోస్ల దూరం వెళ్తేగాని నీళ్లు దొరకని పరిస్థితి. ఒక్క బిందే నీళ్లు తెచ్చుకోడానికి రెండు గుట్టలు దిగి చెలిమే నుంచి నీళ్లు పట్టుకొని మోసుకొచ్చేటోళ్లం. ఈ బాధలు తట్టుకోలేక అక్కడే స్నానాలు చేసి బట్టలు పిండుకొని నీళ్లబిం దెతో వచ్చే సంఘటన గుర్తు చేస్తేనే కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. మాకు స్వరాష్ట్రంలో సౌకర్యాలు కలిగాయి. నీళ్ల బాధ తీర్చిన ఈ సర్కార్కు, సీఎం సార్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– టేకం భీంబాయి, శివగూడ(కెరమెరి)
నీటి కష్టాలు తీరాయి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం ఆయ్యాకే తాగునీటి కష్టాలు తీరాయి. మూడేండ్ల క్రితం సర్కారోళ్లు మా ఇంటి వద్ద నల్లా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రోజు నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. ఏ కాలమైనా నల్లా నీళ్లు సరఫరా అవుతున్నాయి. తాగునీటి సౌకర్యం కల్పించిన సర్కారుకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– టేకం పగ్గుబాయి, శివగూడ(కెరమెరి)