ఎదులాపురం : నవరాత్రి ఉత్సవాల సందర్భంగా షీ టీం బృందాలు మరింత అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రోజు నిర్వహించే షీటీం కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు తమకు జరుగుతున్న అన్యాయంపై ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసే విధంగా పరిస్థితులు మారాలన్నారు. ఆ విధమైన ఏర్పాట్లను షీటీం బృందంలో వారికి కల్పించాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల విషయంలో ఇది చాలా అవసరమని, తమ సమస్యలను పరిష్కరించేందుకు షీ బృందాలు ఉన్నాయనే విషయం వారికి తెలియజేయాలన్నారు.
అమ్మవారి దర్శనానికి మండపాల వద్దకు పెద్దసంఖ్యలో మహిళలు ,బాలికలు తరలివస్తారని షీటీంలోని సభ్యులు స్థానిక పెట్రోలింగ్, గస్తీ పోలీసు అధికారులతో కలిసి క్లస్టర్ విభాగంగా భద్రత చర్యలు చేపట్టాలన్నారు. క్యూఆర్ కోడ్ పై మరింత అవగాహన కల్పించి, అన్ని కళాశాలలు,విద్యా సంస్థల వద్ద సమావేశమై చైతన్యపరచాలన్నారు. అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకురావాల్సింది డయల్ 100 ఫోన్ నంబర్ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో షీటీం ఇన్చార్జి అధికారులు ఈగల సునీత రెడ్డి, కే. ఉజ్వల, కే. గణపతి, డి. విజయ్కుమర్, బి. సుశీల్, సీహెచ్ శివాజీ, ప్రవీణ్, ఆడే ఉత్తం, బి. సుగుణ, సి.భాగ్యశ్రీ, ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత తదితరులు పాల్గొన్నారు.