కాగజ్నగర్ టౌన్, మార్చి 4 : కాగజ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ సభ్యులు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం కాగజ్నగర్ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎన్నికల అధికారి, ఆర్డీవో సురేశ్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జనవరి 20న చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ రాచకొండ గిరీశ్కుమార్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కొత్తగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తంగా 30 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇందులో 26 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. చైర్పర్సన్గా షాహిన్ సుల్తానా (19వ వార్డు), వైస్ చైర్మన్గా స్వామిశెట్టి రాజేందర్ (15వ వార్డు)లను ఏక్రగీవంగా కౌన్సిలర్లు ఎన్నుకున్నారు.
అనంతరం ఎన్నికల అధికారి, ఆర్డీవో సురేశ్ సమక్షంలో చైర్పర్సన్, వైస్ చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్లతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ముందు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ర్యాలీగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కోనేరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కోనేరు వంశీ వారిని అభినందించి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకుడు కోనేరు ఫణి ఉన్నారు.