మంచిర్యాల, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :సింగరేణిలో సౌర కాంతులు విరజిమ్ముతున్నాయి. సంస్థ దేశవిదేశాల్లో కీర్తి కెరటాలను ఎగురవేస్తూనే బొగ్గు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నది. మరోవైపు కార్మికుల సంక్షేమం, రక్షణను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్నది. పర్యావరణాన్ని కాపాడడానికి, సంస్థపై భారం తగ్గించ డానికి, విద్యుత్ బిల్లులు ఆదా చేయడానికి సౌర విద్యుత్పై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే కోల్బెల్ట్ వ్యాప్తంగా 300 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో ఇప్పటికే కొన్ని పూర్తయి, విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఎస్టీపీపీలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను నెలకొల్పింది. వంద ఎకరాల్లో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించగా.. ప్రస్తుతం రూ.26 కోట్లతో చిన్న రిజర్వాయర్లో ఐదు మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరో 35 ఎకరాల్లో రూ.52 కోట్లతో పది మెగావాట్ల ప్లాంటును త్వరలో ప్రారంభించనుంది.
నీటిపై తేలియాడుతూ రోజూ ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్కు సింగరేణి జీవం పోసింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో 100 ఎకరాల్లో ఉన్న రిజర్వాయర్లో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. 20 వేల ఫ్లోటర్స్ మీద 20 వేల సోలార్ ప్యానల్స్ బిగించింది. చిన్న రిజర్వాయర్లో 17.5 ఎకరాల్లో సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. ఈ మధ్యే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన ఈ ఫ్లోటెడ్ సోలార్ ప్లాంట్ బుధవారం రికార్డు స్థాయిలో 12 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని నమోదు చేసింది. మరికొన్ని రోజుల్లో ఇది పూర్తిస్థాయి 25 వేల యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనుంది. ఈ రిజర్వాయర్లలో మొత్తం 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం రూ.26 కోట్లతో చిన్న రిజర్వాయర్లో ఐదు మెగా వాట్ల ఉత్పత్తి కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. పక్కనే ఉన్న మరో పెద్ద రిజర్వాయర్లోని 35 ఎకరాల్లో రూ.52 కోట్లతో 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ లెక్కన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్పై సింగరేణి సంస్థ రూ.78 కోట్లు ఖర్చు చేయనుంది.
ఈ ప్లాంట్తో 219 మెగావాట్లకు చేరువ..
సింగరేణి సంస్థకు 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా.. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్లాంట్లతో 219 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నది. సాధారణంగా సింగరేణి సంస్థ యేటా రూ.456 కోట్ల కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నది. అందుబాటులోకి వచ్చిన 219 మెగావాట్లతో యేటా రూ.220 కోట్ల కరెంట్ బిల్లు ఆదా అవుతున్నాయి. మిగిలిన లక్ష్యం పూర్తి చేస్తే దాదాపు రూ.300 కోట్ల కరెంట్ బిల్లు ఆదా అవుతుందనేది అంచనా. అయితే.. సోలార్ ప్లాంట్లలో ఇది ఒక్కటి మాత్రమే ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ కావడం గమనార్హం. రిజర్వాయర్ లోపల చుట్టూ 90 దిమ్మెలు ఏర్పాటు చేశారు. ఏడున్నర మీటర్ల ఎత్తు వరకు నీళ్లు వచ్చినా ఈ దిమ్మెలకు తాడు సాయంతో సోలార్ ప్యానల్స్ను పట్టుకొనే ఉంటాయి. కొట్టుకుపోకుండా చూస్తాయి. నీరు చేరే కొద్దీ ఫ్లోటింగ్ సోలార్ మీదకు లేస్తుంటుంది. ఈ ఫ్లోటింగ్ ప్లాంట్కు అన్నింటి కన్నా ముఖ్యంగా ల్యాండ్ సేకరించాల్సిన పని ఉండదు. నీటిలోనే ఉంటుంది. పైగా నీరు ఆవిరి కాకుండా చూస్తుంది. వాటర్లో ఉన్న కారణంగా సోలార్ ప్యానల్స్కు కింది నుంచి కూలింగ్ వస్తుంటుంది. మీద నుంచి ఎండ ఉంటుంది. దీంతో సాధారణంగా బయట భూమి మీద ఉన్న ప్యానల్స్లో పోలిస్తే ఇవి 3 శాతం నుంచి 4 శాతం వరకు అధిక విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి.
పైగా ఇందులో ఉపయోగించిన సోలార్ ప్యానల్స్ కూడా చాలా ప్రత్యేకమైనవి. మల్టీ క్రిస్టల్లైన్ డ్యూయల్ గ్లాస్(ప్రేమ్లెస్ గ్లాసులు) ఇక్కడ ఉన్నాయి. సాధారణ ప్యానల్స్ 10 నుంచి 15 సంవత్సరాల్లో పాడైపోతాయి. కానీ.. వీటి లైఫ్టైమ్ చాలా ఎక్కువ. ఈ సోలార్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ నేరుగా పక్కనున్న సబ్స్టేషన్కు వెళ్లి అక్కడి నుంచి బయటి సబ్స్టేషన్కు వెళ్తుంది. ఇలా ఎంత పవర్ వెళ్లిందో మళ్లీ అంత రిటర్న్ తీసుకుంటారు. సింగరేణి అవసరాలకే ఈ విద్యుత్ను ఉపయోగిస్తారు.
సత్ఫలితాలు ఇస్తున్నది..
ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ మంచి ఫలితాలు ఇస్తున్నది. విద్యుత్ ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించాం. 12 వేల యూనిట్లు అత్యధిక ఉత్పత్తి రికార్డు అయ్యింది. కొంత పని ఉంది. అది పూర్తయితే ఈ ప్లాంట్ రోజు ఐదు మెగావాట్లు ఉత్పత్తి చేస్తుంది. మరో 10 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కూడా పక్కనున్న రిజర్వాయర్లో ఏర్పాటు చేస్తాం. ఈ పనులు అయిపోగానే అవి మొదలుపెడుతాం. సోలార్ ఎనర్జీలో భూమి సేకరణ అనే సమస్య ఉండదు. ఏ రకంగా చూసుకున్న ఇది చాలా బెటర్. – డీవీఎస్ సూర్య నారాయణరాజు, జీఎం, ఎస్టీపీసీ.
సమగ్ర వివరాలు..