తాండూర్ : పారిశుద్ధ్య కార్మికులు ( Sanitation Workers ) సమాజానికి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డీ వెంకటేశ్వర్ రావు( DPO Venkateshwara Rao ) అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఆదివారం మండలంలోని పలు గ్రామపంచాయతీలలో ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.
బోయపల్లి గ్రామపంచాయతీలో జరిగిన కార్యక్రమంలో డీపీవో మాట్లాడారు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా పరిశుభ్రత కోసం నిరంతరం కష్టపడి పనిచేసే కార్మికులను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామంలోని అన్ని మురికి నీటి కాలువలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, డ్రై వేస్ట్ ఎక్కడా కనిపించకుండా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్కు తరలించి కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పారిశుద్ద్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, పీపీఈ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో జి అనిల్ కుమార్, సర్పంచ్ సుందిల్ల శంకరమ్మ, ఉప సర్పంచ్ నల్లల మహేష్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సంధ్య, ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.