ఆదిలాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అధికారులు పట్టణాలు, పల్లెల్లో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వైద్యశాఖ అధికారులు 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 6, గ్రామాల్లో 26 శిబిరాలను నిర్వహిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శిబిరాల వద్ద ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రంలో రోజు 200 నుంచి 300 మంది వరకు పరీక్షలు చేస్తున్నారు. రోజు 4వేల నుంచి 4500 మందికి స్క్రీ నింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు శిబిరాలను సందర్శిస్తున్నారు. ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
3,31,806 మందికి పరీక్షలు
జిల్లాలో శుక్రవారం వరకు కంటి వెలుగు కార్యక్రమం 83 రోజులుగా కొనసాగుతున్నది. జిల్లాలో రెండు విడుతలో 31 వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3,31,806 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు.వీరిలో 38,559 మంది కి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. పరీక్షలు నిర్వహించిన వారిలో 46,070 మందికి రిఫరల్ అద్దాలు అవసరంకాగా ఇప్పటి వరకు 32,907 మందికి అందించారు. పరీక్షల్లో భాగంగా 32,907 ప్రిస్కిప్షన్ అద్దాలు అవసరమయ్యాయి. అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడంతో పాటు మందులు ఇస్తున్నారు. ఎలాంటి అద్దాలు వాడాలో వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు కంటి వైద్యం కోసం ఖర్చులకు భయపడి పరీక్షలు చేయించుకోలేదు. ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజలకు వరంగా మా రింది. తమ కండ్లలో వెలుగులు నింపడానికి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగపడుతున్నదని ప్రజలు అంటున్నారు.