మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ), నిర్మల్ టౌన్, డిసెంబర్ 5 : ఎనకట రైతన్న ఇంట్లో ఉప్పు తప్ప మరొకటి కొనే అవసరమే ఉండేదికాదు.. కానీ ప్రస్తుతం ప్రతీదీ కొనే పరిస్థితి వచ్చింది. గతంలో తీరొక్క పంటలతో ప్రతి ఇల్లూ ధాన్యాగారంలా ఉండేది. కాలక్రమేణా నీటి లభ్యత, యాంత్రీకరణతో విప్లవాత్మక మార్పుల కారణంగా సులభతరమైన పంటలైన వరి, పత్తి సాగుకు అలవాటు పడిపోయారు. ఫలితంగా ఇతర పంటల ఉత్పత్తులు తగ్గిపోయి.. వాటికి మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనబోమని స్పష్టం చేస్తుండగా, నాటితరం పంటల వైపు రైతన్నలను మళ్లించాల్సిన అవసరం ఏ మేరకు ఉందనే విషయాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. ధాన్యం ఉత్పత్తి, పత్తి దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రధానంగా ఆదిలాబాద్ పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. వరి సాగు విషయానికొచ్చే సరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం ససేమిరా అంటున్న నేపథ్యంలో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇతర పంటలే శరణ్యంగా మారిన తరుణంలో సాగుబడి సమర్థవంతంగా సాగాలంటే మూస పంటలు, అశాస్త్రీయ పద్ధతులను వీడాల్సిన పరిస్థితి నెలకొంది. రైతే రాజు.. అన్న నాటి పరిస్థితులను మననం చేసుకుంటూ, ఆరోగ్య జీవనంవైపు పయనించాల్సిన అవసరముంది. సర్కారు సూచనలతో, తీరొక్క పంటలతో ముందుకెళ్లాల్సి ఉంది. జొన్నలు, సజ్జలు, కొర్రలు, మినుములు, ధనియాలు, పల్లికాయలు, పొగాకు, నూలువంటి పంటల వైపు అడుగులు వేయాల్సి ఉంది.
నాడు అలా.. నేడు ఇలా..
‘రైతే రాజు.., రైతే దేశానికి వెన్నెముక’ అన్నది నానుడి.. అదే సత్యం.. 50 ఏండ్ల కిందటి దాకా వ్యవసాయం చేసే రైతన్నకు కష్టం తప్ప నష్టం తెలియదు. అందుబాటులో ఉన్న పశువుల పేడ, ఆకులు అలములనే ఎరువులుగా ఉపయోగించి సేద్యం చేశారు. ఇప్పుడున్నంత పెట్టుబడులు లేవు. అపరాలు, నూనెగింజలు, దుంపలు, చిరుధాన్యాలు.. ఇలా తీరొక్క పంటతో కళకళలాడిన పల్లెలు నేడు ‘వర్రీ’లో పడ్డాయి. అయితే వరి.. లేదంటే పత్తి.. వేసి ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉత్పత్తిదారుడుగా ఉండాల్సిన అన్నదాత.. వినియోగదారుడిగా మారిపోతున్నాడు. నాటి పెద్దలను చూస్తే ముచ్చటేస్తుంది. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ వారి పనివారే చేసుకుంటుండగా, నేటి యువత మాత్రం ప్రతి పనికీ పనిమనిషి మీద ఆధారపడాల్సి వస్తున్నది. ఎండకు, వానకు, చలికి తట్టుకుని వారు యథేచ్ఛగా నిలబడితే.. నేటి ప్రజలు మాత్రం మోకాళ్లు, తలనొప్పులు, జ్వరం.. తదితర రోగాలంటూ నిత్యం యాతన పడుతున్నారు. నాటి తిండిలో బలముందని, నేడు తినేదంతా మందుల తిండేనని పెద్దలు చెబుతున్నారు. ఎనకటిలాగే తీరొక్క పంటలు పండిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు నేడు ప్రయత్నించకపోవడం శోచనీయం.
మారిన ఎవుసం
50 ఏండ్లతో పోలిస్తే ఎవుసం స్వరూపమే పూర్తిగా మారిపోయింది. గతంలో తీరొక్క పంటలతో ప్రతి ఇల్లూ ధాన్యాగారంలా ఉండేది. ప్రజల అవసరాలకు తగినట్లుగా పాడి, పంటలతో ప్రతి పల్లే కళకళలాడేది. కాలక్రమేనా నీటి వనరులు, యాంత్రీకరణ పెరిగి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. పలు పంటలు కనుమరుగై వరి, పత్తి సాగులోకి వచ్చింది. రైతులంతా వరి, పత్తి మాత్రమే సాగు చేస్తుండడంతో పప్పు ధాన్యాల కొరత వేధిస్తున్నది. డిమాండ్కు తగినట్లుగా పంటల సాగు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరి ధాన్యం కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్లో ఇతర పంటలను సూచిస్తున్నది.
ఇతర పంటల సాగుతో మేలు..
నాటితో పోలిస్తే సాగు ముఖచిత్రమే మారిపోయింది.వానకాలంలో వరి, యాసంగిలో అపరాలు సాగు చేసేవారు. నాన్ ఆయకట్టులో తృణధాన్యాలు, పప్పు దినుసులు సాగయ్యేవి. తర్వాత బోర్లు, బావుల తవ్వకం పెరగడంతో వరి సాగు విస్తరించింది. నీటి లభ్యతతో పంట దిగుబడి పెరిగి డిమాండ్ తగ్గిపోయింది. వరిసాగు పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. పంట మార్పిడి లేకపోవడంతో భూసారం దెబ్బతింటున్నది. పురుగు మందులు, కాంప్లెక్స్ ఎరువులు, మోతాదుకు మించి వాడడంతో ఆహారంలో నాణ్యత లోపించింది. ధాన్యం అమ్ముకునేందుకు కూడా రైతులు అవస్థలు పడుతున్నారు. వానకాలంలో పెద్ద ఎత్తున వరి సాగు చేయడం వల్ల మార్కెట్లో విక్రయించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అదేపనిగా వరి పండిస్తుండడంతో పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటున్నది. పంటల వైవిధ్యీకరణతో పంటల సరళిలో ఉత్తమమైన మార్పులు రావడంతో పాటు, పర్యావరణ సమతుల్యత కూడా చేకూరుతుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పప్పు దినుసులు, నూనె గింజల అవసరానికి, ఉత్పత్తికి గణనీయమైన వ్యత్యాసం ఉంది. దీంతో వివిధ రకాలైన పప్పు జాతి పంటలు, నూనె గింజలు సాగు చేయాల్సిన అవసరం ఉందని సర్కారు చెబుతున్నది.
ఎనకట తీరొక్క పంటలు వేసినం
దండేపల్లి, డిసెంబర్5 :మాది దండేపల్లి మండలం చింతపల్లి గ్రామం. మాకు 5 ఎకరాల భూమి ఉంది. 50 యేండ్ల సంది ఎవుసం జేస్తున్నా. ఇప్పటికంటే ఎనకటి రోజులే బాగున్నయ్. ఎనకట తీరొక్క పంటలు పండించేటోళ్లం.అప్పట్లో ఎవుసం అంటే సంబురంగా ఉండేది. 5 ఎకరాల్లో వరితో పాటు పప్పు దినుసులు, కంది, పెసర, బొబ్బెర, వేరుశెనగ, మక్క, కూరగాయలు, జొన్న, నువ్వులు, పండించేటోళ్లం. కడెం ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లతోనే అన్ని పంటలు తీసేటోళ్లం. పంట చేతికొచ్చే సమయానికి కూలీలు దొరికేటోళ్లు. కిరాణా దుకాణానికి తక్కువ పోయేటోళ్లం. పండుగ వస్తేనే ఏమన్నా సామాను కొనేటోళ్లం. మల్లా సర్కారు ఆరుతడి పంటలు వేయమని చెప్పడం సంతోషంగా ఉంది. పంట మార్పిడితోనే రైతులు, భూమికి మేలు జరుగుతది.
-అక్కల సాంబయ్య, రైతు, చింతపల్లి
ఇంట్లోనే విత్తనాలుండేవి
ఎనకటి ఎవుసమే మంచిగుండె. ఎవుసం చేస్తే ఇప్పుడు పెట్టిన ఖర్చులో చారాణవంతు కూడా ఉండేటిది కాదు. భూమి మొత్తం నాగండ్లతోటే దున్నేటోళ్లం. ఇప్పుడు ఆ ఎడ్లు లేవు.. ఆనాటి ఎవుసం లేదు. నాకున్న నాలుగు ఎకరాల్లో జొన్న, కంది, పెసర, మినుములు, మక్కలు వేసేటిది. చేనులో పశువుల పెంట వేసేటోళ్లం. విత్తనాలు ఇంట్లోనే ఉండేటివి. ఇరవై.. ముప్పై ఏండ సంది కొంచెం కొంచెం పత్తి పంట ఏసుడు మొదలైంది. ఇగ గప్పటి నుంచే విత్తనాలు కొనుడు, ఎరువులు కొనుడు, పురుగుల మందులు కొనుడు మొదలైంది. ఇప్పుడు చేనుదున్నే దగ్గరి నుంచి పంట కోసే దాకా అన్ని ఖర్చులేనాయె. అప్పుడు కలుపునకు తప్ప దేనికీ ఖర్చు ఉండేటిది కాదు. ఇప్పుడు మళ్లా ఎనకటి పంటలు వేసుకునే రోజులచ్చినై..
ఎనకట తీరొక్క పంటలేసినం
కోటపల్లి, డిసెంబర్ 5 : నాకు ఇప్పుడు 75 ఏండ్లు ఉన్నయ్. అప్పటికీ ఇప్పటికీ మస్తు పరాక్ ఉంది. అప్పుడు గట్కా, జొన్న రొట్టె తిన్నం. అంబలి తాగినం. ఇప్పటికీ రోగం నొప్పి తెల్వదు. మా పొలం పనులు నేనే చేస్తున్న. నాలుగు ఎకరాల్లో నువ్వులు, మిర్చి వేసిన. ఎనకట ఉన్న కొంత భూమిలోనైనా రత్నాలు పండించినం. ఇప్పుడు ఎవుసం మస్తు మారిపోయింది. పురుగుల మందేస్తేగాని పంట పండుత లేదు. పెట్టుబడులు ఎక్కువైనయ్. ఇగ పండిన పంటలో సత్తువ ఉంటలేదు. అట్లాంటి తిండి తింటున్నరు కాబట్టే ఇప్పటి పోరగాండ్లు 20 ఏండ్లకే ముసలోళ్లు అవుతున్నరు. ఇగ పొద్దుగాల లేవంగనే దుకాండ్లకు పోయి అన్నీ కొనుక్కుంటున్నరు. ఎనకట ఇంట్లనే అన్నీ దొరికేటివి. పప్పులకు కొదువుండేది కాదు. మునుపటిలాగే బలమైన పంటలు పండిస్తేనే ఆరోగ్యం మంచిగుంటది..
-గుగ్లోత్ ఓశ్యా నాయక్, సర్వాయిపేట