నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 23 : పదోతరగతి వార్షిక పరీక్షలకు అంతా సన్నద్ధం చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. వి ద్యాశాఖ సంచాలకులు దేవసేన, అదనపు సంచాలకులు రమేశ్తో కలిసి గురువారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మన ఊరు-మన బడి’ కింద అన్ని జిల్లాల్లో ప్రతిపాదించిన పనులను మార్చి 31లోగా పూర్తిచేయాలన్నారు. పాఠశాలకు రంగులు, పరిశుభ్రత పాటించేలా చూడాలని సూచించారు. తొలిమెట్టు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, ప్రగతి నివేదికలను ఏ రోజుకారోజు నమోదు చేయాలన్నారు. కాంప్లెక్స్స్థాయి అధికారులు ఈ పనులన్నీ పర్యవేక్షించాలని దేశించారు.
పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలను గుర్తించి, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నట్లు చెప్పారు. ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయిన పాఠశాలల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మల్ నుంచి కలెక్టర్ వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. ‘మన ఊరు-మన బడి’ మొదటి విడుత పనులు పూర్తిచేసినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడించారు. ఈ సమీక్షలో నిర్మల్ నుంచి అదనపు కలెక్టర్ రాంబాబు, డీఈవో రవీందర్ రెడ్డి, అధికారులు శ్రీనివాస్, రాజేశ్వర్ పాల్గొన్నారు.