నిర్మల్ అర్బన్, జనవరి 14 : సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. వయసుతో సంబంధం లేకుండా అందరూ పతంగులు ఎగురవేస్తుంటారు. ఈ పండుగల వేళ పతంగుల ఎగురవేతలో ఎదురుగా ఉన్న దానిని తెంపివేసేందుకు అనేక రకాలు పోటీ పడుతుంటాం. ఈ పోటీల్లో మనం ఏమి చేస్తున్నామో తెలియక అనేక మంది ప్రజలు ప్రమాదాల బారిన పడుతుంటారు.
వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మార్కెట్లో వివిధ రకాల పతంగులను విక్రయిస్తున్నారు. గతంలో కాగితం పతంగులను మాత్రమే విక్రయించగా ఇప్పుడు ప్లాస్లిక్తో పాటు రాజకీయ, క్రీడాకారుల, యువ క్రికెటర్లతో పాటు హీరో, హీరోయిన్లతో కూడిన పతంగులను విక్రయిస్తున్నారు. పతంగులను ఎగురవేసేందుకు చెరక, దారం, లోకల్ మాంజాతో పాటు పర్యావరణానికి, పక్షుల ప్రాణాలకు పెనుముప్పు వాటిల్లే ప్లాస్టిక్, చైనా, నైలాన్ మాంజాను సైతం మార్కెట్లో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. చైనామాంజా వేళ్లను తెంచడంతో పాటు ప్రాణాలకే ప్రమాదమని పర్యావరణవేత్తలు తెలుపుతున్నారు. నూలు పోగుతో తయారైన దారంతోనే పతంగులను ఎగురవేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో ఉపాధ్యాయులు, అటవీ శాఖ అధికారులు పతంగుల తయారీ, దారం వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పతంగులు ఎగురవేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని తెలుపుతున్నారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే చైనామాంజాను విక్రయించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు, అటవీ శాఖ అధికారులు జిల్లాలోని పతంగుల దుకాణాలు, మాంజా తయారీ దారుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇటీవల పట్టణ సీఐ శ్రీనివాస్తో పాటు పోలీసు అధికారులు జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు. చైనా మాంజా విక్రయాలు చేపట్టవద్దని వ్యాపారులకు హెచ్చరించారు.
పతంగుల తయారీతో పాటు వాటిని ఎగుర వేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల విద్యార్థులకు ఇప్పటికే వివరించి అన్ని జాగ్రత్తలపై అవగాహన కల్పించాం. నిషేధిత చైనామాంజాతో పాటు నైలాన్ దారంతో పతంగులను ఎగురవేయవద్దు. కొండలు, పెద్ద పెద్ద భవనాలు, గుట్టలపై పతంగులను ఎగురవేసినట్లయితే జరిగే ప్రమాదాలను వివరించాం.
-శ్రీనివాస్ గౌడ్, వశిష్ట పాఠశాల డైరెక్టర్,నిర్మల్