మంచిర్యాలటౌన్/మంచిర్యాల ఏసీసీ/చెన్నూర్ టౌన్ /చెన్నూర్/మందమర్రి, ఫిబ్రవరి 20 : మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నం) రోజున రెండేళ్లకోసారి జరిగే భక్తుల కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర జరగనుంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో జరిగే జాతరకు మునిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసి భక్తులకు వసతులు కల్పించారు. జాతర జరిగే ప్రాంతాలకు ఆర్టీసీ అధికారులుబస్సులు నడుపుతున్నారు. చెన్నూర్ బస్టాండ్ నుంచి మేడారానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మరికొంత మంది ట్రాక్టర్లు, టాటా ఏసీలు, ఆటోలు, తదితర ప్రైవేట్ వాహనాల్లో తరలివెళ్లారు.
మంచిర్యాల జిల్లా కే్ంరద్రంలో జాతరకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా కేంద్రంలో గోదావరి నది వద్ద జరిగే జాతరకు వచ్చే భక్తుల కోసం విద్యుత్, తాగునీరు, ట్యాంకర్లు, టెంట్లు, క్యూలైన్లు, షవర్ బాత్ కులాయిలు, బట్ల మార్చుకునే గదులు, వాహనాల పార్కింగ్ స్థలం తదితర వసతులు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం సమీపంలో ఇల్లారీ (తల్లుల గుడి) నుంచి సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్నల్లను గద్దెలపైకి చేర్చనున్నారు. మందమర్రి మార్కెట్, బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు నిజామాబాద్, నిర్మల్ డిపోలకు చెందిన 65 బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచారు.
మేడారానికి తరలుతున్న భక్తులు
మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 20: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు తరలివెళ్తున్నారు. మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన పికప్ పాయింట్ నుంచి భక్తులు ఆర్టీసీ బస్సుల్లో మేడారానికి తరలివెళ్తున్నారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ఆరు పికప్ పాయింట్ల నుంచి మంగళవారం మొత్తం 174 బస్సుల ద్వారా 8944 మంది ప్రయాణికులను తరలించారు. ఇందులో 4840 మంది మహాలక్ష్మి పథకం కింద ఉచితప్రయాణం, 4104 మంది చార్జి చెల్లించి ప్రయాణాలు సాగించారు.
జాతరను ఘనంగా నిర్వహించుకోవాలి
నస్పూర్, ఫిబ్రవరి 20 : సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. నస్పూర్లోని కలెక్టరేట్లో డీఈవో యాదయ్యతో కలిసి జాతర పోస్టర్ను విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, వైద్య శిబిరాలను తదితర వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాగ్రీన్ కోర్ సమన్వయకర్త గుండేటి యోగేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.